ఆసియా కప్ (Asia Cup) 2025లో భాగంగా బుధవారం దుబాయ్ (Dubai)లో భారత్ (India), యూఏఈ(UAE) మధ్య జరిగిన మ్యాచ్లో అభిమానులు పెద్దగా రాకపోయినా, ఒకరు మాత్రం మైదానంలో అందరి దృష్టిని ఆకర్షించారు. చేతిలో భారత జెండా పట్టుకుని టీమిండియాను ఉత్సాహపరుస్తూ కెమెరాల్లో కనిపించారు. ఆ తర్వాత ఆమె ఎవరు అని ఆరా తీయగా, ఆమె అఫ్గానిస్థాన్కు చెందిన వజ్మా ఆయుబి అని తెలిసింది. 28 ఏళ్ల వజ్మా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మాత్రమే కాదు, వ్యాపారవేత్త కూడా.
2022 ఆసియా కప్ సమయంలో వజ్మా ఫోటోలు, వీడియోలు వైరల్ కావడంతో ఆమె క్రికెట్ అభిమానులకు పరిచయమయ్యారు. క్రికెట్ పట్ల ఆమెకున్న ఆసక్తి, కెమెరా ముందు ఆమెకున్న ఆత్మవిశ్వాసం అభిమానులను ఆకట్టుకుంది. అప్పటి నుంచి అఫ్గానిస్థాన్ క్రికెట్ జట్టుకు అత్యంత ముఖ్యమైన అభిమానిగా మారారు. వజ్మా అఫ్గానిస్థాన్ అభిమాని అయినా, భారత క్రికెట్ జట్టు అంటే కూడా చాలా ఇష్టం. టీమిండియా పట్ల తనకున్న ప్రేమను బహిరంగంగా వ్యక్తం చేయడానికి ఏమాత్రం వెనుకాడలేదు.
ఆసియా కప్ 2023లో భారత్, బంగ్లాదేశ్ మ్యాచ్ సందర్భంగా ఆమె విరాట్ కోహ్లీ జెర్సీని ధరించారు. ఆ జెర్సీపై కోహ్లీ ఆటోగ్రాఫ్ కూడా ఉంది. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆమెకు మరింత పాపులారిటీ వచ్చింది. కోహ్లీకి తాను పెద్ద అభిమానిని అని, అతడి మ్యాచ్ చూడటానికి ఎక్కడికైనా వెళ్తానని వజ్మా తెలిపారు.
అఫ్గానిస్థాన్లో జన్మించిన వజ్మా, తన బాల్యం అమెరికాలో గడిపారు. ప్రస్తుతం దుబాయ్లో నివసిస్తూ రియల్ ఎస్టేట్, ఫ్యాషన్ రంగాల్లో వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. ఆమె సామాజిక కార్యకర్త కూడా. అఫ్గానిస్థాన్లోని పేద పిల్లల కోసం పనిచేసే చైల్డ్ఫండ్ సంస్థకు అంబాసిడర్గా ఉన్నారు. ఆమె జీవనశైలి, క్రికెట్ పట్ల మక్కువ, భారతీయ ఆటగాళ్ల పట్ల ఉన్న అభిమానం ఆమెను ఎప్పుడూ వార్తల్లో ఉండేలా చేస్తాయి.
వజ్మా వచ్చిన మ్యాచ్లలో భారత్ గెలిచిన సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి. ఈసారి కూడా ఆమె దుబాయ్లో ఉన్నారు. భారత్, పాకిస్థాన్ మ్యాచ్కు హాజరవుతారు. ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్పై భారత్ విజయం పక్కా అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.