టీమిండియా హెడ్కోచ్ గౌతమ్ గంభీర్పై మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశారు. గంభీర్ నాయకత్వంలో భారత జట్టు బలపడుతుందని ఆశించినప్పటికీ, ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్లో ఎదురైన తాజా ఓటమి ఆ అంచనాలను పటాపంచలు చేసిందని ఆయన అన్నారు. ఈ ఓటమి గంభీర్పై ఒత్తిడిని మరింత పెంచుతుందని చోప్రా అభిప్రాయపడ్డారు.
టెస్టుల్లో పేలవమైన ప్రదర్శన
తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడుతూ, గంభీర్ కోచ్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత టీమిండియా మరింత శక్తివంతం అవుతుందని ఆశించామని చోప్రా తెలిపారు. వైట్-బాల్ క్రికెట్లో మంచి ఫలితాలు సాధించినప్పటికీ, టెస్ట్ క్రికెట్లో మాత్రం జట్టు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిందని ఆయన అన్నారు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో ఎదురైన ఓటముల తర్వాత, శుభ్మన్ గిల్ నేతృత్వంలో హెడింగ్లీలో ఇంగ్లాండ్తో జరిగిన తొలి టెస్టులో ఐదు వికెట్ల తేడాతో ఓటమి పాలవ్వడం సిరీస్\u200cను దారుణంగా ప్రారంభించిందని చోప్రా పేర్కొన్నారు. గంభీర్ తన వ్యూహాలతో తక్షణమే ఫలితాలను సాధించాలని, లేకపోతే అతనిపై ఒత్తిడి మరింత పెరుగుతుందని చోప్రా హెచ్చరించారు.
కొత్త కెప్టెన్ కు మినహాయింపు, కోచ్ పై ప్రశ్నలు
ఆస్ట్రేలియా సిరీస్ ఓటమి తర్వాత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి సీనియర్ ఆటగాళ్లు టెస్ట్ క్రికెట్ నుండి నిష్క్రమించారు. గిల్ నేతృత్వంలో కొత్తగా ఏర్పడిన జట్టుకు ఇంగ్లాండ్ పర్యటనలో చేదు అనుభవం ఎదురైంది. గిల్ కొత్త కెప్టెన్ అయినందున అతన్ని నిందించలేమని, కానీ గంభీర్పై మాత్రం ప్రశ్నలు తప్పవని చోప్రా స్పష్టం చేశారు. “భారత క్రికెట్ జట్టు బాగా ఆడితే అందరూ గర్విస్తారు, కానీ ప్రదర్శన పడిపోతే విమర్శలు తప్పవు. గిల్ కొత్త కెప్టెన్ కాబట్టి అతనిపై కొంత ఓపికగా ఉంటాను, కానీ గంభీర్ పై మాత్రం ప్రశ్నలు తప్పవు” అని చోప్రా పేర్కొన్నారు.
గంభీర్పై భారీ ఒత్తిడి..
గౌతమ్ గంభీర్ భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గా ఉన్న గత తొమ్మిది టెస్ట్ మ్యాచ్ లలో, భారత జట్టు కేవలం బంగ్లాదేశ్ తో జరిగిన ఒక టెస్ట్ సిరీస్ ను మాత్రమే గెలిచిందని చోప్రా గుర్తు చేశారు. న్యూజిలాండ్తో జరిగిన సిరీస్లో 3-0 తేడాతో వైట్వాష్ అయిందని, ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని 3-1 తేడాతో కోల్పోయిందని ఆయన తెలిపారు.
“గౌతమ్ గంభీర్పై చాలా ఒత్తిడి ఉంది. టెస్ట్ క్రికెట్లో అతని కోచింగ్ రికార్డును చూస్తే, అతను ఎక్కువ మ్యాచ్ లు గెలవలేదు. బంగ్లాదేశ్పై రెండు మ్యాచ్ లు, ఆస్ట్రేలియాపై ఒక మ్యాచ్ మాత్రమే గెలిచారు. కానీ న్యూజిలాండ్తో మూడు, ఆస్ట్రేలియాతో మూడు, ఇంగ్లాండ్తో ఒక మ్యాచ్లను మేము కోల్పోయాము” అని చోప్రా వివరించారు.
సాకులకు తావు లేదు..
గంభీర్కు బీసీసీఐ నుండి అడిగిన ప్రతి విషయాన్ని అందించారని, కాబట్టి సాకులు చెప్పేందుకు అతనికి ఎటువంటి అవకాశం లేదని చోప్రా తేల్చి చెప్పారు. ఇప్పుడు గంభీర్ ఫలితాలు అందించాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. “వైట్-బాల్ క్రికెట్లో అతని పనితీరు బాగుంది. జట్టు బాగా ఆడుతోంది. కానీ టెస్ట్ క్రికెట్లో జట్టు ప్రదర్శనపై చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఇంగ్లాండ్ సిరీస్పై చాలా ఒత్తిడి ఉంది. ఒకవేళ ఈ సిరీస్ కూడా బాగా జరగకపోతే, కోచ్ పై తీవ్రమైన ప్రశ్నలు తలెత్తుతాయి. భారత క్రికెట్ బాగా ఆడాలని నేను కోరుకుంటున్నాను” అని ఆకాశ్ చోప్రా తన వ్యాఖ్యలను ముగించారు.