తమిళనాడు ప్రజలపై హిందీ భాషను బలవంతంగా రుద్దడం జరిగితే, దాన్ని నిర్మూలించడం కూడా తమ బాధ్యతేనంటూ సీఎం ఎం.కే. స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళ విప్లవ కవి భారతీదాసన్ రాసిన కవితను స్టాలిన్ ‘ఎక్స్’లో షేర్ చేస్తూ, కేంద్ర ప్రభుత్వ భాషా విధానంపై వ్యతిరేకత వ్యక్తం చేశారు.
‘‘హిందీని రుద్దితే దాన్ని నిర్మూలించక తప్పదు’’ అని పేర్కొంటూ, తమిళం తమ మాతృభాషగా నిలుస్తుందని స్టాలిన్ తేల్చి చెప్పారు. త్రిభాషా విధానానికి వ్యతిరేకంగా తమిళనాడు ప్రజలు వినూత్న నిరసన చేపట్టారు. చెన్నై అంబత్తూరు సమీపంలోని అయపాక్కంలో మహిళలు 2 కి.మీ. మేర రోడ్డుపై అక్షరాలతో ముగ్గులు వేసి హిందీపై నిరసన తెలియజేశారు. ‘‘హిందీని బలవంతంగా రుద్దొద్దు.. మళ్లీ భాషా వ్యతిరేక ఉద్యమానికి ఆజ్యం పోయొద్దు’’ అంటూ ప్రజలు తమ భావాలను వ్యక్తం చేశారు.