వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా భక్తులు దేవాలయాలకు పోటెత్తారు. తెలుగు రాష్టాల్లోని ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తిరుమల, యాదగిరిగుట్ట, భద్రాచలం, ద్వారకా తిరుమలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. గోవింద నామస్మరణలతో తిరుమల కొండ మారుమోగుతోంది. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 4:30 గంటలకు దర్శనం ప్రారంభమైంది. మొదట వీఐపీలకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించింది టీటీడీ.
తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామిని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణంరాజు, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రులు అనిత, కొలుసు పార్థసారథి, నిమ్మల రామానాయుడు, సవిత, సంధ్యారాణి ఉన్నారు. తెలంగాణ నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి దామోదర రాజనర్సింహ, పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ మంత్రి మల్లా రెడ్డి, మాజీ మంత్రి కడియం శ్రీహరి, మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి, సినీ నటులు బండ్ల గణేష్, రాజేంద్రప్రసాద్, సప్తగిరి,యోగా గురువు రాందేవ్ బాబా, చాముండేశ్వరి నాథ్, బ్యాడ్మింటన్ పుల్లెల గోపీచంద్ సహా పలువురు శ్రీవారిని దర్శించుకున్నారు.
భద్రాద్రి కొత్తగూడెంలో కూడా వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీసీతారాముల వారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా వచ్చారు. ఉత్తర ద్వార దర్శనం తిలకించడానికి రెండు తెలుగు రాష్ట్రాల నుండి భక్తులు భారీగా తరలి వచ్చారు. అదే విధంగా ఏలూరు జిల్లాలోని ద్వారకా తిరుమలలో ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు జరుగుతున్నాయి. స్వామివారి దర్శనం కోసం గోవింద స్వాములకు, గ్రామస్తులకు మరో ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేశారు.