హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) రణరంగంగా మారింది. యూనివర్సిటీ భూములు అమ్మేందుకు వీల్లేందంటూ విద్యార్థులు (Students) ఆందోళనను ఉధృతం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపడుతూ సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. హెచ్సీయూలోని 400 ఎకరాల భూమిని తీసుకొని దాంట్లో కమర్షియల్ లేఅవుట్లు వేసి అమ్ముకోవచ్చని అసెంబ్లీ వేదికగా సీఎం ప్రకటించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని విద్యార్థులు, విద్యార్థి సంఘాలు తీవ్రంగా తప్పుపడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం (Congress Party Student Wing) అయిన ఎన్ఎస్యూఐ (NSUI) కూడా సీఎం రేవంత్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ అనుచితమైన, ఆగ్రహకరమైన వ్యాఖ్యలు అంటూ ఓ ప్రకటన విడుదల చేసింది.
యూనివర్సిటీ ఏర్పాటు ఇలా..
హెచ్సీయూ నిర్మాణం కోసం 1974లో ప్రత్యేక పార్లమెంట్ చట్టం ద్వారా ఆమోదం తెలపగా, 1975లో 2,324 ఎకరాల భూమిని కేటాయిస్తూ అప్పటి రాష్ట్రపతి ప్రత్యేక గెజిట్ విడుదల చేశారు. ఈ ప్రక్రియ అంతా ఇందిరాగాంధీ (Indira Gandhi) హయాంలో జరిగింది. కాగా, రాష్ట్రపతి గెజిట్ (Special Gazette) ప్రకారం ఈ భూములను అకాడమిక్ పర్పస్ కోసం మాత్రమే వాడుకోవాలి. అలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో ముఖ్యమంత్రులు అకాడమిక్ అవసరాల కోసం హెచ్సీయూలోని భూములు కేటాయిస్తూ వచ్చారు. టెక్నికల్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూషన్ల (Technical & Research Institutions) నిర్మాణ అవసరాలకు హెచ్సీయూ సుమారు 810 ఎకరాల భూమిని కోల్పోయింది. 2003 ఆగస్టు వరకు హెచ్సీయూ వద్ద 1500 ఎకరాల భూమి మిగిలి ఉంది.
చంద్రబాబు హయాంలో ఐఎంజీకే భూకేటాయింపులు..
2003లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) తొలిసారి నాన్ అకాడమిక్ కంపెనీకి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను కేటాయించారు. 2003 ఆగస్టు 5న రిజిస్టర్ అయిన ఐఎంజీ భారత్ (IMG Bharat) కంపెనీకి హెచ్సీయూ పరిధిలోని 400 ఎకరాలను, సరూర్నగర్ మండలం మామిడిపల్లి (Mamidipalli) లో విమానాశ్రయం సమీపంలోని 450 ఎకరాలను (ఎకరం రూ.10 కోట్లు విలువ చేసే భూములను కేవలం రూ.50 వేలకే) 2003 ఆగస్టు 9న కేటాయించారు. ఈ కేటాయింపులకు నాలుగు రోజుల ముందు రిజిస్టర్ అయిన కంపెనీకి 850 ఎకరాల భూములు కేటాయించడం పట్ల అప్పట్లో విమర్శలు వ్యక్తమయ్యాయి. క్రీడామైదానాలు కట్టి 2020 ఒలంపిక్స్కు క్రీడాకారులను సిద్ధం చేస్తామని కంపెనీ యజమాని అహో బలరావు ప్రచారం చేసుకున్నారు. నాలుగు రోజుల ముందు పుట్టిన కంపెనీకి చంద్రబాబు నాయుడు కారుచౌకగా భూములు అప్పగించడంపై అప్పటి ప్రతిపక్ష పార్టీలన్నీ అభ్యంతరం తెలిపాయి.
ఐఎంజీ ఒప్పందం రద్దు చేసిన వైఎస్సార్
2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నెగ్గింది. వైఎస్ రాజశేఖరరెడ్డి (YS Rajasekhara Reddy) ముఖ్యమంత్రి అయ్యారు. ఆ వెంటనే ఐఎంజీ భారత్కు చంద్రబాబు కారుచౌకగా కట్టబెట్టిన భూముల ఒప్పందాన్ని రద్దు చేశారు. వైఎస్సార్ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఐఎంజీ కోర్టును ఆశ్రయించింది. అప్పటి నుంచి ఈ కేసు స్టేటస్ కోలో ఉంది. 18 ఏళ్ల సుదీర్ఘ వాదనల తరువాత ఐఎంజీ కంపెనీకి షాక్ ఇస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు చెప్పింది. యూనివర్సిటీ భూమిని ప్రైవేట్ కంపెనీ అయిన ఐఎంజీకి చంద్రబాబు నాయుడు కేటాయించారని, వాటిని వెనక్కి తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.
చంద్రబాబు దారిలో రేవంత్..
యూనివర్సిటీ భూమిని వెనక్కి తీసుకోమని కోర్టు ఆదేశాలివ్వడంతో ఆ భూమిపై సర్వహక్కులు తెలంగాణ ప్రభుత్వానివే అని భావించిన సర్కార్.. చంద్రబాబు ఐఎంజీకి కేటాయించిన 400 ఎకరాల్లో కమర్షియల్ లేఅవుట్లు వేసి అమ్ముకుంటామని చెబుతోంది. 1975లో విడుదలైన రాష్ట్రపతి గెజిట్ ప్రకారం ఈ భూమిని అకాడమిక్ పర్పస్ కోసం మాత్రమే వినియోగించాల్సి ఉంది. కానీ, రేవంత్ సర్కార్ కమర్షియల్ కోసం ఉపయోగిస్తామని చెప్పడంతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల అభిప్రాయం తెలుసుకోకుండా ఆ ప్రాంతంలో జింకలు, పులులు, సింహాలు లేవు.. చుట్టూ గుంటనక్కలు చేరాయంటూ సీఎం రేవంత్ అసెంబ్లీలోనే వ్యంగ్యంగా మాట్లాడి విద్యార్థుల ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు. చంద్రబాబు భూ కేటాయింపులతో మొదలైన ఈ వివాదం.. ఆఖరికి ఏ దశకు చేరుతుందో వేచిచూడాలి.