రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రభుత్వంపై తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పటాన్ చెరు మండలంలోని గణేశ్ గడ్డ సిద్ధివినాయక ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఆయన, అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఏడాది పాలనతోనే ప్రజలకు కాంగ్రెస్ పరిపాలనపై స్పష్టత వచ్చిందన్నారు. మాటలు తప్ప చేతలు లేని ప్రభుత్వంతో విసిగిపోయిన ప్రజలు తిరిగి కేసీఆర్ (KCR) వైపు చూస్తున్నారు అని చెప్పారు.
కేసీఆర్ పాలనలో మిషన్ కాకతీయ, చెరువుల పునరుద్ధరణ, రైతులకు నీటివసతి వంటి అభివృద్ధి పనులు నడిచాయని గుర్తుచేసిన హరీశ్రావు.. రేవంత్ రెడ్డి నోటి నుంచి చంపుతా, తొక్కుతా వంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు వస్తున్నాయన్నారు. కేసీఆర్ భాష సాగు భాష (Language Of Progress) అయితే, రేవంత్ రెడ్డి భాష చావు భాష (Language Of Destruction) అని హరీశ్ రావు విరుచుకుపడ్డారు. మూసీ (Musi) పేరు మీద మూడు నెలలు (3 Months), హైడ్రా (Hydra) పేరు మీద ఆరు నెలలు (6 Months) పాలన దారితప్పిందని ఎద్దేవా చేశారు. రియల్ ఎస్టేట్ కేసీఆర్ హయాంలో విస్తరిస్తే, ఇప్పుడు కుప్పకూలిందన్నారు. రూ. 15 వేల రైతు బంధు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్, ఇప్పుడు రూ.10 వేలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉందన్నారు. వానకాలం, యాసంగి కలిపి రూ.14 వేల కోట్లు ఇవ్వాల్సిన రైతుబంధు నిధులు ఇవ్వకుండా చేతులు దులుపుకున్నారని హరీశ్రావు మండిపడ్డారు.
వివాదాస్పద కేసులు… సీఎం క్షమాపణ చెప్పాలి
ఒకవైపు ముఖ్యమంత్రి విద్యార్థులపై కేసులు పెడతారు, మరోవైపు ఉపముఖ్యమంత్రి అవే కేసులు వెనక్కి తీసుకుంటామని చెబుతారు. ఇది ఏ రకమైన పాలన? కుక్క తోకను నడుపుతోందా? తోక కుక్కను నడుపుతోందా అన్నట్లు ఉందీ దృశ్యం అని హరీశ్రావు అన్నారు. హెచ్సీయూ విద్యార్థులపై పెట్టిన కేసులకు సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
రాహుల్ ఆందోళనకు రాలేదని ఎద్దేవా
రాహుల్ గాంధీ ని తీసుకొచ్చి పార్లమెంటులో బీసీ బిల్లు ఆమోదింపజేస్తానన్న రేవంత్ రెడ్డి.. చివరకు ఢిల్లీలో ఉన్న రాహుల్ గాంధీ ఆ ధర్నా (Protest) కు కూడా రాలేదని హరీశ్ రావు ఎద్దేవా చేశారు. మరుసటి రోజు సోనియాగాంధీ (Sonia Gandhi), రాహుల్ గాంధీ (Rahul Gandhi) లు రేవంత్ లేకుండానే ఇతర నేతలతో ఫోటోలు దిగడం కూడా ఇదే విషయానికి నిదర్శనమని పేర్కొన్నారు.