జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని (National Rural Employment Guarantee Scheme) కేంద్రం (Central Government), రాష్ట్ర ప్రభుత్వాలు (State Governments) నిర్వీర్యం చేస్తున్నాయని సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) ఆరోపించారు. దారిద్ర్య రేఖకు దిగువన జీవిస్తున్న ప్రజలకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఉన్న ఈ పథకం ప్రస్తుతం తీవ్రంగా నిర్వీర్యమవుతోందని ఆయన మండిపడ్డారు. హరీశ్ రావు మాట్లాడుతూ.. గతంలో రాష్ట్రవ్యాప్తంగా ఉపాధి హామీ పనిదినాలు 12.22 కోట్లుగా ఉండగా, ఇప్పుడు అవి కేవలం 6.5 కోట్లకు తగ్గిపోయాయన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి (Chief Minister) రేవంత్ రెడ్డి (Revanth Reddy) 42 సార్లు ఢిల్లీకి వెళ్లినా.. ఈ అంశంపై స్పందించలేదని మండిపడ్డారు.
ఎంపీలు ఎందుకు మౌనంగా ఉన్నారు?
కేంద్రం ఉపాధి పనిదినాలు తగ్గించినా, రాష్ట్రంలో ప్రజల ఓట్లతో గెలిచిన కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP) ఎంపీలు (MPs) ఈ విషయంపై ఎందుకు నోరు మెదపట్లేదు అని హరీష్ రావు ప్రశ్నించారు. “వారు ఎవరి పక్షాన నిలబడుతున్నారు? ప్రజల పక్షమా.. లేక అధికారుల పక్షమా?” అంటూ ఆయన తీవ్రంగా ప్రశ్నించారు. గత నాలుగు నెలలుగా ఉపాధి హామీ కూలీలకు వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇది చాలా ఘోరమైన పరిణామమని ఆయన అన్నారు. ప్రజల జీవితాలతో ఆడుకోవడం తగదని, ఇప్పటికైనా ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుని తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పని దినాల పెంపుపై డిమాండ్
తగ్గించిన పని దినాలను తిరిగి పెంచాలని, గ్రామీణ ప్రజలకు ఉపాధి హామీ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని హరీశ్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉపాధి లేక ఇబ్బందిపడుతున్న పేద కుటుంబాలకు న్యాయం జరగాలంటే కేంద్ర, రాష్ట్రాలు సమగ్ర చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.