మహిళలను కోటీశ్వరులను చేస్తామన్న వాగ్దానాలు ఇచ్చి చివరకు మహిళల ఆశలపై నీళ్లు చల్లుతోందని కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు ధ్వజమెత్తారు. ఏడాదిన్నర పాలనలో మహిళలకు ఏమాత్రం మేలు జరగలేదని, తీరా ఇప్పుడు వేడుకలు జరుపుకోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. కాంగ్రెస్ హయాంలో మహిళలకు వేదనే మిగిలిందని ఆరోపించారు.
హామీల అమలుకు తేదీలు ప్రకటించండి
ఎన్నికల సమయంలో ఐదేళ్లలో లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు మహిళలకు అందిస్తామని హామీ ఇచ్చి ఏడాదిన్నర తర్వాత కూడా కనీసం రూ.5 వేల కోట్ల బకాయిలు కూడా చెల్లించలేకపోయారని హరీశ్ రావు విమర్శించారు. మహిళలకు ప్రతి నెల రూ.2500 ఇస్తామన్న హామీని కూడా అమలు చేయని ప్రభుత్వం, ఇందిరా మహిళా శక్తి పేరిట వేడుకలు చేయడం సిగ్గుచేటన్నారు. నిజంగా మహిళల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి ఉంటే, ఇప్పటికైనా హామీల అమలు తేదీలను ప్రకటించాలని డిమాండ్ చేశారు.
చేతల్లో గడప దాటని ప్రభుత్వం
రేవంత్ రెడ్డి మాటల్లో కోటలు దాటుతుంటే, చేతల్లో మాత్రం గడప దాటడం లేదని హరీశ్ రావు ఎద్దేవా చేశారు. కేసీఆర్ ప్రారంభించిన మహిళా సంక్షేమ పథకాలను రద్దు చేసి, కొత్తగా ఎలాంటి ప్రయోజనాలు అందించని కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు కోట్లు ఖర్చు చేసి కేవలం ప్రచారానికే పరిమితమైందన్నారు. పెరిగిన క్రైం రేటుతో మహిళల భద్రత ప్రమాదంలో పడిందని, ఉద్యోగ నోటిఫికేషన్ల లేమితో యువతుల భవిష్యత్తు ప్రశ్నార్థకమైందని ఆయన వ్యాఖ్యానించారు.