‘సభ ఆరు రోజులు కూడా నడపరు’ – చిట్‌చాట్‌లో హ‌రీష్ రావు కీల‌క వ్యాఖ్య‌లు

'సభ ఆరు రోజులు కూడా నడపరు' - చిట్‌చాట్‌లో హ‌రీష్ రావు కీల‌క వ్యాఖ్య‌లు

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో సభ నిర్వహణ, ప్రభుత్వ తీరుపై ఆయన విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ సమావేశాల కాలాన్ని పెంచాలని, ప్రజా సమస్యలపై పూర్తిస్థాయిలో చర్చ జరగాలని ఆయన డిమాండ్ చేశారు.

“సభ ఆరు, ఏడు రోజులు కూడా నడవదు”
ప్రభుత్వం ఈ నెల 30 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని ప్రకటించినప్పటికీ, అందులో ఐదు రోజులు సెలవులే పోతాయని హరీష్ రావు గుర్తు చేశారు. “ప్రభుత్వం చెప్పిన రోజుల్లో మూడు పండుగలు, రెండు ఆదివారాలు ఉన్నాయి. ఈ ఐదు రోజులు తీసేస్తే సభ ఆరు, ఏడు రోజులు కూడా నడవదు. అందుకే అసెంబ్లీని ఈ నెల 31 వరకు నిర్వహించాలని కోరాం” అని ఆయన తెలిపారు. సభను ఆదివారం (22వ తేదీ) నిర్వహించాలా అని ప్రభుత్వం అడిగిందని, ప్రజల పక్షాన చర్చ జరగాలంటే ఆదివారం సభ పెట్టడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసినట్లు చెప్పారు.

బీఆర్ఎస్ తరపున 19 కీలక అంశాలు
రాష్ట్రంలోని ప్రధాన సమస్యలపై చర్చించేందుకు బీఆర్ఎస్ తరపున 19 అంశాలను ప్రభుత్వానికి సమర్పించినట్లు హరీష్ రావు వెల్లడించారు. డిప్యూటీ స్పీకర్ నియామకాన్ని త్వరగా చేపట్టాలని డిమాండ్ చేశారు. పలు అంశాలపై హౌస్ కమిటీలు వేయాలని కోరామని, చర్చల మధ్యలో మంత్రులు అడ్డుతగలవద్దని సూచించామని తెలిపారు. అసెంబ్లీని ఉదయం 9 గంటలకే ప్రారంభించాలని, పాయింట్ ఆఫ్ ఆర్డర్ మరియు ప్రొటెస్ట్ (నిరసన) చేయడానికి విపక్షాలకు తగిన సమయం ఇవ్వాలని కోరారు. అసెంబ్లీ లైబ్రరీని బాగు చేయాలని ప్రభుత్వానికి విన్నవించారు.

తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణపై అసహనం
తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంపై హరీష్ రావు తీవ్ర విస్మయం వ్యక్తం చేశారు. “తెలంగాణ తల్లి విగ్రహం ప్రారంభానికి మాకు ఎలాంటి ఆహ్వానం అందలేదు. ప్రధాన ప్రతిపక్షాన్ని పిలవకపోవడం అనేది వాళ్ల విజ్ఞతకే వదిలేస్తున్నాం” అని ఆయన అసహనం వ్యక్తం చేశారు. సభలో గవర్నర్ ప్రసంగంపై చర్చ, బడ్జెట్ ప్రవేశపెట్టడం వంటి కార్యక్రమాలు సజావుగా సాగాలంటే ప్రభుత్వం విపక్షాల డిమాండ్లను పరిగణనలోకి తీసుకోవాలని హరీష్ రావు హితవు పలికారు.

Join WhatsApp

Join Now

Leave a Comment