తెలంగాణ యువ క్రికెటర్ త్రిష గొంగడి అండర్-19 మహిళల వరల్డ్ కప్లో అసాధారణ ప్రదర్శన కనబరిచి భారత జట్టు విజయంలో కీలక భూమిక పోషించింది. ఈ గర్వించదగ్గ విజయాన్ని తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. జూబ్లిహిల్స్లోని సీఎం నివాసంలో గొంగడి త్రిష ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం ఆమెను అభినందించారు. త్రిష భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించిన సీఎం, ఆమెకు ప్రోత్సాహంగా రూ. 1 కోటి నజరానా ప్రకటించారు.
ఇతర క్రికెటర్లకు కూడా నగదు ప్రోత్సాహం
అండర్-19 వరల్డ్ కప్ జట్టు సభ్యురాలైన తెలంగాణ క్రికెటర్ ధృతి కేసరికి రూ. 10 లక్షలు, జట్టు హెడ్ కోచ్ నౌషీన్, ట్రైనర్ షాలినిలకు రూ. 10 లక్షల చొప్పున ప్రోత్సాహకం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, శాట్స్ చైర్మన్ శివసేన రెడ్డి, సీఎం కార్యదర్శి షానవాజ్ ఖాసీం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం క్రీడా రంగాన్ని మరింత అభివృద్ధి చేయడానికి అన్ని విధాలా క్రీడాకారులకు సహాయసహకారాలు అందిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.