బాబోయ్ బంగారం.. తులం అక్ష‌రాల రూ.ల‌క్ష

బాబోయ్ బంగారం.. తులం అక్ష‌రాల రూ.ల‌క్ష

Summarize with AI

పసిడి ప్రేమికులకు ఇది నిజంగా షాకింగ్‌ న్యూస్‌. గత పదిహేను రోజులుగా ఎగబాకుతున్న బంగారం ధర ఇప్పుడు ఏకంగా లక్ష రూపాయల మార్క్‌ను టచ్‌ చేసింది. ఓ తులం (10 గ్రాములు) 24 క్యార‌ట్‌ బంగారం ఇప్పుడు ఏకంగా రూ. 1,00,000 (One Lakh Rupees)కు చేరిపోయింది. ఈ ధరల పెరుగుదలతో వినియోగదారులు గుండెలు పట్టుకుంటున్నారు. లక్ష రూపాయల దగ్గరికి బంగారం వచ్చిన ఈ సంద‌ర్భాన్ని మరచిపోలేం.

హైదరాబాద్‌లో రూ. 99,860
ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో ఒక ఔన్స్‌ బంగారం ధర $3,500 (US Dollars) కు చేరగా, హైదరాబాద్‌ (Hyderabad) లో రిటైల్‌ మార్కెట్‌లో బంగారం ధర రూ. 99,860 గా నమోదైంది. అంటే లక్షకు కేవలం రూ. 140 మాత్రమే తేడా. రేపు ఉదయానికే ఈ ధర దాటి పోతుందని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ట్రంప్‌ ‘షాక్స్‌’ వల్లే ఈ తుపాన్‌
ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) వ్యవహారం నిలిచింది. ఆయన విధించే వాణిజ్య సుంకాలు, ఫెడ్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ (US Federal Reserve)పై ఒత్తిళ్లు బంగారం మార్కెట్‌ను దారుణంగా ప్రభావితం చేశాయి. ఫెడ్‌ చీఫ్‌ జెరొమ్‌ పావెల్‌ (Jerome Powell)ను తొలగించాలన్న ట్రంప్‌ హెచ్చరికలతో పెట్టుబడిదారుల్లో భయం మొదలైంది.

పెళ్లిళ్లు కలగా మారిన రోజులు..
ఇవాళ బంగారం కొనుగోలు సాధారణ మధ్యతరగతి కుటుంబాల‌కు అసాధ్యమైనదిగా మారింది. ఆడపిల్లల పెళ్లిళ్లు ఎలా చేయాలా అని తల్లిదండ్రులు తలలు పట్టుకుంటున్నారు. “ఇక బంగారం మర్చిపోండి” అని కొందరు సలహా ఇవ్వాల్సిన స్థితి ఏర్పడింది. పెళ్లిళ్లలో పసిడి కొనే ప్రసక్తే లేదన్నంత దూరానికి వెళ్లిపోయింది పరిస్థితి. మార్కెట్‌ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, గోల్డ్‌ రేట్లు ఇక్కడితో ఆగేలా లేవు. ట్రంప్‌ చర్యలు, ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, వడ్డీ రేట్లపై అస్పష్టత తదితర అంశాలు బంగారం ధరలను ఇంకా ఎగబాకేలా చేస్తున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment