ప్రజా సమస్యలు, కూటమి నేతల అవినీతి, అక్రమాలు ప్రజల్లోకి వెళ్లకుండా చంద్రబాబు ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని, రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టిస్తోందని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. తాడేపల్లిలో జరిగిన వైసీపీ (YCP) పీఏసీ సమావేశంలో పాల్గొన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూటమి పాలనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం దుష్ట సంప్రదాయాల దిశగా లాగుతోందని, ఇలాంటి దుర్మార్గాలు ఇప్పటి వరకూ చూడలేదని వ్యాఖ్యానించారు. ముంబై నటి జత్వానీ కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులును అరెస్ట్ చేయడాన్ని జగన్ తీవ్రంగా ఖండించారు. ఇదే కేసులో మరో ఇద్దరు పోలీస్ అధికారులపై కోర్టు ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిందని గుర్తుచేశారు. ‘‘కక్ష రాజకీయాలకు ఇది పరాకాష్ట. ఒకరిని ఇరికించేందుకు తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తున్నారు. ఏవిధంగా వ్యవస్థలు దిగజారుతున్నాయో ఇది ఉదాహరణ’’ అన్నారు.
పెద్దిరెడ్డి కుటుంబం లక్ష్యంగా దాడులు
ఎంపీ మిథున్ రెడ్డిని టార్గెట్ చేయడం, పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడంపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘కాలేజీ రోజుల్లో చంద్రబాబును ఎదిరించినందుకు కక్ష పెంచుకున్నారు. లేని ఆరోపణలు, తప్పుడు కేసులతో వేధిస్తున్నారు. మనం తీసుకొచ్చిన లిక్కర్ పాలసీ (Liquor Policy) ప్రగతిశీలమైంది. ప్రైవేట్ దుకాణాలను తొలగించి ప్రభుత్వమే నిర్వహించేలా చేశాం. లిక్కర్ అమ్మకాలు తగ్గిస్తే లంచాలు ఇస్తారా? అమ్మకాలు పెంచితే లంచాలు ఇస్తారా? ఈ అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి’’ అని సూచించారు.
విశాఖ భూములపై జగన్ విమర్శలు
‘‘ఊరు పేరులేని కంపెనీలకు విశాఖలో రూ.3వేల కోట్ల విలువైన భూములు రూపాయికే ఇచ్చారు. లులూ గ్రూపుకి రూ.2000 కోట్ల విలువైన భూములు కట్టబెట్టారు. రాజధానిలో రూ.36వేల కోట్ల పనులను రూ.77వేల కోట్లకు పెంచి దోచేస్తున్నారు. జ్యుడిషియల్ ప్రివ్యూ, రివర్స్ టెండరింగ్ అన్నీ తొలగించారు’’ అని జగన్ ఆరోపించారు. ‘‘ఫీజు రీయింబర్స్మెంట్ కింద రూ.7000 కోట్ల బకాయిలు ఉన్నా కేవలం రూ.700 కోట్లు మాత్రమే విడుదల చేశారు. ఆరోగ్యశ్రీ పూర్తిగా నిలిపేశారు. రైతులకు గిట్టుబాటు ధర లేదు. పెన్షన్లు నాలుగు లక్షలు తగ్గించారు. కొత్తగా ఒక్క పెన్షన్ కూడా మంజూరు చేయలేదు. ఉచిత పంటల బీమా లేదు’’ అని జగన్ విమర్శించారు.
మీడియా మద్దతుతో దుష్ప్రచారం
‘‘టీడీపీకి పత్రికలు, ఛానళ్ల బలం ఉంది. సోషల్ మీడియాలో వారికి ఉన్మాదులు ఉన్నారు. మనకు వాటిలా బలాలు లేకపోయినా, కార్యకర్తలు ఫోన్ అనే ఆయుధాన్ని వినియోగించాలి. గ్రామస్థాయిలో కార్యకర్తలతో ప్రజల్లోకి నిజాలను తీసుకెళ్లాలి. ఇప్పుడు మనం ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల సమస్యలపై గళమెత్తాలి. చురుకుగా స్పందించాలి. సమావేశాల్లో అజెండాలను నిర్దేశించాలి. జిల్లాల్లో ఏ చిన్న సమస్య అయినా మన సమస్యలుగా తీసుకుని కమిటీలు ఏర్పాటు చేసి పరిష్కారం కోసం పని చేయాలి. పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగాలి’’ అని పీఏసీ సభ్యులకు స్పష్టంగా చెప్పారు.