అధికారంలోకి వచ్చి పట్టుమని 10 నెలలు అయినా గడవకముందే కూటమిలో కుమ్ములాటలు తారాస్థాయికి చేరుతున్నాయి. తెలుగుదేశం(TDP), జనసేన(Jana sena) కొట్లాట కూటమిలో వివాదాలు రేపుతోంది. జనసేన నేతలపై టీడీపీ నాయకుల దాడులు కొనసాగుతున్నాయి. ఇసుక మాఫియా, మద్యం సిండికేట్, మట్టి దందా విషయంలోనే ఇరు పార్టీల మధ్య విభేదాలు తల్లెతెతున్నాయని వెల్లువెత్తుతున్నాయి.
కూటమి ప్రభుత్వం ఏర్పడగానే 40 లక్షల టన్నులకు పైగా ఇసుకను మాయమైందనే ఆరోపణలు ఉన్నాయి. ఉచిత ఇసుక ఊసేలేదు. మూడు నాలుగింతల ధరలకు అమ్ముకుంటున్నారు. రాష్ట్రంలో బెల్ట్ షాపులు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయాయి. మట్టి మాఫియా పేట్రేగిపోతోంది. ఈ అవినీతి కార్యకలాపాల్లో వాటా కోసం తెలుగుదేశం, జనసేన నేతల కొట్లాట రచ్చకెక్కతుఓందని ఆరోపణలు మొదలయ్యాయి. అంతేకాకుండా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పదవులన్నీ టీడీపీ నేతలే పంచుకుంటున్నారని, జనసేనను పట్టించుకోవడం లేదంటూ జనసైనికులు తిరగబడుతున్నారు. జనసేన కార్యకర్తలు కూడా ఎన్నికల్లో కష్టపడ్డామని, అన్యాయం చేస్తే సహించేది లేదని హెచ్చరించిన ఘటనలు ఉన్నాయి.
పవన్ కల్యాణ్ నియోజకవర్గంలోనూ టీడీపీ నేతలు జనసేనపై దౌర్జన్యలు కొనసాగుతున్నాయి. పిఠాపురంలోని కొత్తపల్లి మండలం కోనపాపపేట వద్ద కేఎస్ఈజెట్ లో పైపులైన్ నిర్మిస్తున్న ఓ కంపెనీ వద్ద జనసేన నేతలు రూ.6 కోట్లు లంచం తీసుకున్నారంటూ టీడీపీ నేతలు ప్రచారం చేశారు. దీంతో నాలుగు కుటుంబాలను గ్రామం నుంచి వెలివేసినట్లు టీడీపీ నేతలు మైక్, ఫ్లెక్సీల ద్వారా ప్రచారం చేశారు. మద్యం షాపును అడ్డుకోవాలని చూస్తే లేపేస్తామంటూ జనసేన కార్యకర్తలపై టీడీపీ శ్రేణులు వార్నింగ్ ఇచ్చిన ఘటనలు కూడా బాపట్ల జిల్లా కొల్లూరులో వెలుగుచూశాయి. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో మట్టి దందా కోసం జనసేన, టీడీపీ నాయకులు తన్నుకుంటున్న ఉదంతాలు కొనసాగుతున్నాయి. (Tirupati) తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం పాకాలవారిపల్లికి చెందిన జనసేన నేత పాశం గురుమూర్తిని పొలం తగాదా విషయంలో టీడీపీ నేత బెదిరించిన ఉదంతం వెలుగు చూసింది. టీడీపీ నేతకు మద్దతుగా సీఐ జోక్యం చేసుకుని కాల్చిపడేస్తానంటూ బెదిరించారు.
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఓ బ్యానర్ వివాదంలో జనసేన నేత యర్రంశెట్టి నానితో టీడీపీ నేత శంకు శ్రీను కాళ్లు పట్టించుకుని క్షమాపణ చెప్పించుకున్న ఘటన రాష్ట్రంలో కలకలం రేపింది. జనసైనికులను తీవ్ర అవమానాలకు గురి చేస్తున్నా పవన్ కల్యాణ్ మిన్నకుండిపోతున్నారని పార్టీ కేడర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రతినెలా 1వ తేదీన పంపిణీ చేసే పింఛన్ల కార్యక్రమానికి పిలవలేదని జనసేన నేతలు టీడీపీపై గుర్రుగా ఉన్నారు.
ఏపీ బీజేపీలో అంతర్గత పోరు రచ్చకెక్కుతోంది. అసలైన బీజేపీ నాయకులను వలస నేతలు తొక్కేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇటీవలి పరిణామాలు ఇందుకు ఊతమిస్తున్నాయి. ముందునుంచి ఉన్న అసలైన బీజేపీ నాయకులను ప్రస్తుత రాష్ట్ర బీజేపీ (BJP) అధ్యక్షురాలు పురందేశ్వరి ఎదగనివ్వడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సోము వీర్రాజు, మాజీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు, విష్ణువర్ధన్ రెడ్డి లాంటి సీనియర్ల అభిప్రాయాలను లెక్కచేయడం లేదన్న విమర్శలున్నాయి. కేవలం టీడీపీతో అంటకాగిన వారికే ప్రాధాన్యమిస్తున్నారని, బీజేపీ జాతీయ నాయకత్వాన్ని బలపరిచే వారిని ఓ ప్లాన్ ప్రకారం సైడ్ చేసేస్తున్నారన్న విమర్శలున్నాయి. ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటనలో పాల్గొననీయకుండా జాబితాల నుంచి వీరు పేర్లు తొలగించినట్లుగా నేతలు ఆరోపిస్తున్నారు.








