ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈవీఎం(Electronic Voting Machines)లలో నిక్షిప్తమైన డేటాను తొలగించవద్దని సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్(EC)కు స్పష్టం చేసింది. హర్యానా రాష్ట్ర అసోసియేషన్ ఆఫ్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ (ADR) మరియు కాంగ్రెస్ నేతలు ఈవీఎంల డేటాపై అనుమానాలు వ్యక్తం చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన ధర్మాసనం, ఈవీఎంలలో ఎలాంటి డేటా డిలీట్ చేయొద్దని ఈసీకి ఆదేశాలు జారీ చేసింది.
తొలగించొద్దు, రీలోడ్ చేయొద్దు!
‘ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత కూడా ఈవీఎంలలోని డేటాను తొలగించకూడదు. అలాగే, ఏ విధమైన డేటాను తిరిగి రీలోడ్ చేయకూడదు’ అని చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. అవసరమైన సందర్భంలో కోర్టు ముందుకు ఈ డేటాను సమర్పించాల్సి వస్తుందని, ఒకవేళ తొలగిస్తే సమస్యలు తలెత్తే అవకాశముందని కోర్టు అభిప్రాయపడింది.
ఓటమిపాలైన అభ్యర్థులు వివరణ కోరినప్పుడు, ఈవీఎంల్లో ట్యాంపరింగ్ జరగలేదని నిర్ధారించేందుకు ఇంజినీరింగ్ పరిశీలన అవసరమవుతుందని జస్టిస్ ఖన్నా వెల్లడించారు. ఈవీఎంల మైక్రో కంట్రోలర్, మెమొరీల నుంచి డేటాను తొలగించే విధానం ఏమిటో 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్ను ఆదేశించింది. ఈ కేసుపై తదుపరి విచారణను మార్చి 3వ తేదీకి వాయిదా వేసింది.







