హైదరాబాద్లో విషాదకర రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాల్లో దీపం ఆరిపోయేలా చేసింది. ఏపీలోని విజయనగరానికి చెందిన కొల్లూరు అక్షిత (20) హోటల్ మేనేజ్మెంట్ పూర్తి చేసి ఉపాధి కోసం దుబాయ్ వెళ్లేందుకు సిద్ధమవుతూ ఆదివారం రాత్రి హైదరాబాద్కు వచ్చింది. సోమవారం మెహిదీపట్నంలో ఇంటర్వ్యూకు హాజరై ర్యాపిడో బుక్ చేసుకుంది. అదే సమయంలో సంతోష్నగర్ ట్రాఫిక్ పోలీస్స్టేషన్లో హోంగార్డుగా పనిచేస్తున్న సయ్యద్ హుస్సేన్ (40) విధులు ముగించుకుని పార్ట్టైమ్ ర్యాపిడో డ్రైవర్గా డ్యూటీలో చేరాడు. అక్షితను బైక్పై ఎక్కించుకుని పంజగుట్ట వైపు వెళ్తుండగా విషాదం చోటుచేసుకుంది.
బంజారహిల్స్ రోడ్ నెం–1లోని వెంగళరావు పార్క్ టర్నింగ్ వద్ద అతివేగంగా వచ్చిన వాటర్ ట్యాంకర్ వీరి బైక్ను వెనుకనుంచి ఢీకొట్టింది. ఇద్దరూ రోడ్డుపై పడిపోగా ట్యాంకర్ వెనుక టైర్ వారిపై నుంచి వెళ్లింది. అక్షిత అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, తీవ్ర గాయాలతో ఉన్న హుస్సేన్ను నిజాం ఇనిస్ట్యూట్ ఆఫ్ టెక్టాలజీ మెడికల్ సైన్స్ కు తరలించారు. అయితే చికిత్స పొందుతూ కొద్దిసేపటికే ఆయన కూడా మృతి చెందారు.
ఈ ఘటనపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ట్యాంకర్ డ్రైవర్ ఖాజాపాషాను అరెస్టు చేసి హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు సమాచారం. చాంద్రాయణగుట్టకు చెందిన హుస్సేన్కు ముగ్గురు పిల్లలు ఉండగా, కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. మరోవైపు, దుబాయ్ వెళ్లే ఆనందంలో ఉన్న అక్షిత కలలు క్షణాల్లో చిద్రమయ్యాయి. ఒకే ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం నగరాన్ని కలచివేసింది.








