ఉత్తరాంధ్ర అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్గా నిలిచిన మూలపేట పోర్టు (Mulapeta Port) సందర్శనలో భాగంగా నౌపడ మూడురోడ్ల జంక్షన్ వద్ద నిర్వహించిన భారీ బహిరంగ సభలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు (Dharmana Prasada Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. పరిపాలన వికేంద్రీకరణ (Decentralization), రాజధాని (Capital) అంశాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
అప్పుడు నవ్వి.. ఇప్పుడు ఏడుస్తున్నారు
సభలో ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. వైసీపీ(YSRCP) అధికారంలో ఉన్న సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) ప్రతిపాదించిన వికేంద్రీకరణ సిద్ధాంతాన్ని అప్పట్లో ప్రతిపక్షాలు ఎగతాళి చేశాయని గుర్తుచేశారు. “జగన్ వికేంద్రీకరణ అంటే అందరూ నవ్వుకున్నారు. కానీ, ఈరోజు ఉత్తరాంధ్ర ప్రజలకు అర్థమవుతోంది.. జగన్ ఏం చేశారో, జనం ఏం నష్టపోయారో! కేవలం ఒకే ప్రాంతం అభివృద్ధి చెందాలనే కుట్రలను ప్రజలు గమనిస్తున్నారు. టీడీపీని(TDP) తరిమికొట్టే రోజు దగ్గరలోనే ఉంది” అని ధర్మాన హెచ్చరించారు.
65 ఏళ్ల వృథా ప్రయాణం
రాజధాని కోసం ఒకే ప్రాంతంలో వేల కోట్లు కుమ్మరించడాన్ని ధర్మాన తీవ్రంగా తప్పుబట్టారు. “గడిచిన 65 ఏళ్లుగా మనం ఒక్క రాజధాని హైదరాబాద్ (Hyderabad) కోసమే ఖర్చు పెట్టాం. ఇప్పుడు మళ్లీ మొత్తం రాష్ట్ర బడ్జెట్ను ఆ ఒక్క అమరావతికే (Amaravati) ఖర్చు పెడతారా?” అని ప్రశ్నించారు. అభివృద్ధి చెందిన తర్వాత “ఇక్కడి నుంచి వెళ్లిపోండి” అని అమరావతి వాళ్లు అంటే మన పరిస్థితి ఏంటి? అని ఆయన ఉత్తరాంధ్ర వాసులను ఆలోచింపజేశారు.
రాజధాని మార్చే హక్కు ఉండాలి
రాజధాని అనేది ఒకచోట బందీ కాకూడదని ధర్మాన అభిప్రాయపడ్డారు. “మన రాజధాని గతంలో ఎన్నిసార్లు మారింది? మద్రాస్ (Madras) నుంచి కర్నూలుకు, అక్కడి నుంచి హైదరాబాద్కు, ఆపై అమరావతి వరకు రాజధాని మారలేదా?” అని ప్రశ్నించారు. రాజ్యాంగం పేరుతో రాజధానిని ఒకే చోట బంధించడం సరికాదని, ప్రజల నిర్ణయం మేరకు రాజధానిని మార్చే హక్కు ప్రభుత్వాలకు ఉండాలని ఆయన స్పష్టం చేశారు. మూలపేట పోర్టు నిర్మాణాన్ని వైసీపీ ప్రభుత్వం శరవేగంగా చేపట్టిందని, ఈ ఘనతను మరుగున పడేసేందుకు టీడీపీ చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.








