భారతదేశ రాజకీయాల్లో ఎన్నో దశాబ్దాల పాటు అధికారం అనుభవించిన పార్టీ పరిస్థితి ఇప్పుడు దయనీయంగా తయారైంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా మూడోసారి ఓటమిని ఎదుర్కొంటూ, మరోసారి చేతులెత్తేసింది. 70 సీట్లు ఉన్న ఢిల్లీ అసెంబ్లీలో కాంగ్రెస్ ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది. తొలుత బద్లీ నియోజకవర్గంలో ఆధిక్యంలో ఉన్నట్టు కనిపించినా, చివరకు బీజేపీ ఆ స్థానాన్ని దక్కించుకుంది. ఫలితంగా 2015, 2020 ఎన్నికల్లాగే 2025లో కూడా కాంగ్రెస్ పూర్తిగా మట్టికరిపోయింది.
ఒకప్పుడు రాజధానిపై పట్టున్న పార్టీ
ఒకప్పుడు 15 ఏళ్ల పాటు నిరవధికంగా ఢిల్లీని పాలించిన కాంగ్రెస్, ఇప్పుడు కనీసం ప్రతిపక్ష హోదాను కూడా పొందలేకపోయింది. మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వంటి నేతలు ప్రచారం నిర్వహించినా, ఓటర్లపై పెద్దగా ప్రభావం చూపలేదు.
చివరిసారిగా 2013లో కాంగ్రెస్ 8 సీట్లు గెలుచుకుంది. అప్పట్లో బీజేపీకి మెజారిటీ మార్క్ దూరంగా ఉండటంతో, ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కానీ, 49 రోజులకే ఆ ప్రభుత్వాన్ని కూల్చేసింది. ఆ తర్వాత జరిగిన ప్రతి ఎన్నికలో కాంగ్రెస్ పూర్తిగా ఓ మూలకు చేరిపోయింది. ప్రస్తుత ఎన్నికల్లోనూ ఒక్క సీటు కూడా గెలుచుకోకుండా డకౌట్ అయ్యింది.








