జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఉపఎన్నికలకు (By-Elections) సంబంధించి బీజేపీ(BJP) అధిష్టానం తమ అభ్యర్థిని ప్రకటించింది. బుధవారం ఉదయం లంకల దీపక్ రెడ్డి (Lankala Deepak Reddy) పేరును ఆ పార్టీ కేంద్ర నాయకత్వం అధికారికంగా వెల్లడించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన మాగంటి గోపీనాథ్ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఆయన మరణంతో ఈ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది.
ఈ ఉప ఎన్నికలో విజయం సాధించాలని అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు వ్యూహాలు రచిస్తూ ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా నవీన్ యాదవ్ ను ప్రకటించింది. బీఆర్ఎస్ తరఫున దివంగత మాగంటి గోపీనాథ్ సతీమణి అయిన మాగంటి సునీత బరిలోకి దిగారు. తాజాగా, బీజేపీ అధిష్టానం ఈ కీలక ఉప ఎన్నికల్లో లంకల దీపక్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించడంతో, జూబ్లీహిల్స్ పోరు రసవత్తరంగా మారింది.







