తెలంగాణ రాష్ట్రం (Telangana State) జగిత్యాల (Jagtial) జిల్లాలో అమానవీయ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇస్లాంపుర వీధి (Islampur street)లో నివసించే వృద్ధురాలు (Elderly Woman) బుధవ్వను (Budhavva), ఆమె కూతురు ఈశ్వరీ (Daughter Eeshwari) రెండు రోజుల క్రితం అడవిలో వదిలేసిన ఘటన స్థానికులను కలచివేసింది. ముందస్తు పథకం ప్రకారం.. ఈశ్వరీ తల్లికి మాయమాటలు చెప్పి అడవి (Forest)లోకి తీసుకెళ్లింది. కొంతదూరం వెళ్లిన తరువాత నిర్మానుష్య ప్రదేశం చూసుకొని ఆమె మెడలో ఉన్న ఆభరణాలను (Jewellery) లాగేసుకుంది.
నవమాసాలు మోసి కనీ పెంచిన తల్లిని అడవిలోనే వదిలి పారిపోయింది. ఎటు వెళ్లాలో తెలియక వృద్ధురాలు బుధవ్వ ఆ అడవిలో రెండ్రోజులుగా తిండి, మంచినీరు లేకుండా బిక్కుబిక్కుమంటూ గడిపింది. అయితే బుధవారం సాయంత్రం కొందరు యువకులు ఆమెను గమనించి జిల్లా అధికారులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన అధికారులు బుధవ్వను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ దారుణ ఘటనపై స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కన్న తల్లి పట్ల కూతురు ఇలా ప్రవర్తించడం పట్ల పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.