దళిత యువకులపై (Dalit Youths) జరిగిన అమానుష హింస (Inhuman Violence) ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. బాపట్ల (Bapatla) జిల్లాలో మార్టూరు మండలం డేగరమూడికి చెందిన అల్లడి ప్రమోద్కుమార్ (Alladi Pramod Kumar), జ్యోతి పోతులూరి (Jyothi Pothuluri)లను శుక్రవారం పోలీస్ స్టేషన్కు పిలిపించి సీఐ శేషగిరి (CI Seshagiri) బూటుకాళ్లతో తొక్కి తీవ్రంగా హింసించారని బాధితులు ఆరోపిస్తున్నారు. అంతేకాదు, ఇద్దరు కానిస్టేబుళ్లతో లాఠీలతో అరికాళ్లపై దారుణంగా కొట్టించి, తరువాత గులకరాళ్లపై నడిపించారని వాపోయారు. కాళ్లకు గాయాలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. దాడి సంఘటన గురించి బయట చెబితే మళ్లీ ఇదే గతి ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించారని కన్నీరు పెట్టుకున్నారు.
ఈ హింస వెనుక రాజకీయ కక్షలున్నాయని బాధితులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో నెలరోజులుగా అంబేడ్కర్ విగ్రహస్థాపనపై వివాదం కొనసాగుతుండగా, స్థానిక అధికార పార్టీ నేతలు కుట్ర పన్ని వారిపై తప్పుడు ఫిర్యాదులు చేయించారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. గ్రామానికి చెందిన అన్నం హనుమంతరావుతో మద్యం పోయించి, బెదిరించి టీడీపీ ఫ్లెక్సీలు తొలగింపజేసి, తరువాత దళిత యువకులపై ఫిర్యాదు చేయించినట్టు బాధితులు తెలిపారు.
బాధితుల వివరణ మేరకు హనుమంతరావు కూడా ఈ విషయాన్ని అంగీకరించాడు. ఆయన చెప్పిన మాటలను వీడియో రికార్డు చేసిన బాధితులు, తమపై తప్పుడు కేసు నమోదు చేసి హింసించిన సీఐపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే తమకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని జిల్లా ఎస్పీని విజ్ఞప్తి చేశారు.








