ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్లపై సీపీఐ నేత బాబురావు తీవ్ర ఆరోపణలు చేశారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రంగంలో జరిగిన అవకతవకలు, అదానీకి ప్రాజెక్టుల కట్టబెట్టడం గురించి ఆయన తీవ్ర విమర్శలు చేశారు. వామపక్షాల ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసనలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రజల భారం పెంచిన కూటమి ప్రభుత్వం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, ప్రజలపై చార్జీల భారం మరింతగా పెరిగిందని బాబురావు ఆరోపించారు. గత ఆరు నెలల్లోనే విద్యుత్ చార్జీల పేరుతో రూ.15,500 కోట్ల భారం ప్రజలపై మోపారని మండిపడ్డారు. ప్రజలకు జరుగుతున్న ఈ అన్యాయంపై వామపక్షాలు ఎప్పటికీ పోరాడుతాయని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
అదానీతో ఒప్పందాలపై విమర్శలు
విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయకుండా కొనసాగిస్తున్నందుకు మోదీ, చంద్రబాబు, పవన్లపై సీపీఐ నేత బాబురావు విమర్శలు గుప్పించారు. సోలార్ విద్యుత్ ఒప్పందం ద్వారా ప్రజలపై లక్షా 10 వేల కోట్ల భారం పెడుతున్నారని, ఇది అన్యాయం అని మండిపడ్డారు. చంద్రబాబు గతంలో అవినీతి ఒప్పందంగా విమర్శించిన ప్రాజెక్టును ఇప్పుడు “నీతి ఒప్పందం”గా ఎందుకు చెబుతున్నారని ప్రశ్నించారు.
స్మార్ట్ మీటర్లపై ధ్వజం
గతంలో స్మార్ట్ మీటర్లను పగలగొట్టమని పిలుపిచ్చిన టీడీపీ, ఇప్పుడు అదానీ మేలు కోసం వాటిని అమలు చేస్తోందని బాబురావు విమర్శించారు. స్మార్ట్ మీటర్లు, సర్ధుబాటు చార్జీల విధానం ప్రజా వ్యతిరేకమని, వీటిని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల తరఫున వామపక్షాల పోరాటం కొనసాగుతుందని హామీ ఇచ్చారు. అదానీతో కుమ్మక్కై ప్రజల మీద భారం మోపిన వారిని అడుగడుగునా నిలదీయాలని ప్రజలకు సూచించారు.