తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ప్రజలకు అభివృద్ధి, సంక్షేమం అందిస్తామని మాటలు చెప్పి, అధికారంలోకి వచ్చాక మోసం చేసిన కాంగ్రెస్ హనీమూన్ పిరియడ్ పూర్తయిందని, ఇకపై ప్రజాపోరాటాలు ఎదుర్కోక తప్పదన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ నివాసంలో జరిగిన బీఆర్ఎస్ నేతల సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు.
ఖమ్మం వరద బాధితులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. వరదల సమయంలో మంత్రులు, డిప్యూటీ సీఎం కనీసం పైసా కూడా ఖర్చు పెట్టలేదని, కానీ పుట్టినరోజులకు మాత్రం హెలికాప్టర్లలో వెళ్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల దుస్థితిని పట్టించుకోకుండా, ప్రజా శ్రేయస్సు కోసం పోరాడుతున్న నాయకులను వేధిస్తోందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ బీసీ సంక్షేమంపై ఇచ్చిన హామీలు మోసపూరితమని, కేసీఆర్ ప్రభుత్వం చేసిన సమగ్ర కుటుంబ సర్వేలో బీసీల జనాభా 51.5% అని తేలితే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం దాన్ని తక్కువ చేసి 46%గా చూపించడం కుట్ర అని ఆరోపించారు.
ప్రజల తీర్పు సమీపంలో..
తెలంగాణ ప్రజలు మోసపోయామనే భావనలో ఉన్నారని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పే సమయం దగ్గరలోనే ఉందని కేటీఆర్ హెచ్చరించారు. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ మంత్రులు ఏకగ్రీవానికి కుట్రలు చేస్తున్నప్పటికీ, బీఆర్ఎస్ పార్టీ వాటిని అడ్డుకుంటుందని స్పష్టం చేశారు. త్వరలో ఖమ్మంలో పర్యటిస్తానని కేటీఆర్ హామీ ఇచ్చారు.