ఆంధ్రప్రదేశ్లో (Andhra Pradesh) ఫైబర్ నెట్ (AP FiberNet) సంస్థ మూసివేత (Shutdown) దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల కూటమి ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలతో ఈ అభిప్రాయం బలపడుతోంది. విడతల వారీగా ఫైబర్ నెట్ నుంచి 800 మంది ఉద్యోగులను (Employees) తొలగించిన విషయం తెలిసిందే.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ఫైబర్ నెట్ (AP FiberNet) ప్రధాన కార్యాలయం (Head Office) మూడు నెలల పాటు సీజ్ (Seize) చేశారు. అదేవిధంగా, గత 10 నెలల వ్యవధిలోనే ముగ్గురు ఎండీలు (Managing Directors – MDs) మారిపోయారు. ఈ పరిణామాలతో, ఫైబర్ నెట్ సంస్థ పూర్తిస్థాయిలో మూసివేత దిశగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఉద్యోగుల తొలగింపు, పదవి మార్పులు, కార్యాలయ సీజ్ వంటి చర్యలు దీనికి సంకేతాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్గా నియమించబడిన జీవీ రెడ్డి (GV Reddy).. సంస్థపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఒక్క కనెక్షన్ కూడా కొత్తగా ఎవరూ తీసుకోలేదని, సంస్థకు ఒక్క రూపాయి ఆదాయం కూడా రావడం లేదని మీడియా ముఖంగా చెప్పిన విషయం తెలిసిందే. ఆ తరువాత జరిగిన రాజకీయ పరిణామాలతో జీవీ రెడ్డి ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి రాజీనామా చేసి వెళ్లిపోయారు. జీవీరెడ్డి రాజీనామా తరువాత ఏపీ ఫైబర్ నెట్ను ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టనుందన్న విమర్శలు వినిపించాయి. రూపాయి ఆదాయం కూడా సమకూరకపోవడంతో ఏకంగా సంస్థనే మూసివేసేందుకు ప్రయత్నం అడుగులు వేస్తున్నట్లుగా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. జరుగుతున్న ప్రచారంపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.