తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు ‘ఛలో రాజ్భవన్’ కార్యక్రమం నిర్వహించారు. గౌతమ్ అదానీ ఆర్థిక అవకతవకలు, మణిపూర్లో జరిగిన అల్లర్లపై కేంద్ర ప్రభుత్వ మౌనాన్ని నిరసిస్తూ ఈ కార్యక్రమం చేపట్టారు.
కాంగ్రెస్ నేతలు ర్యాలీగా రాజ్భవన్కు చేరుకుని, రోడ్డుపై బైఠాయించి ప్రధాని నరేంద్ర మోదీ, గౌతమ్ అదానీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రధాని మోదీ, గౌతమ్ అదానీ మధ్య సంబంధాలను ప్రశ్నిస్తూ, మణిపూర్లో జరిగిన అల్లర్లపై ప్రధాని స్పందించకపోవడంపై కాంగ్రెస్ నేతలు తీవ్రంగా విమర్శించారు.
పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపు మేరకు రాజ్భవన్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అసలు అదానీని కాపాడటానికి ఎవరు ప్రయత్నిస్తున్నారో ముందు ఆ విషయం తేలాలని అన్నారు. తమ పోరాటం ఇక్కడితో ఆగదని.. ప్రధాని మోదీ మౌనం వీడకపోతే రాష్ట్రపతి భవన్ ఎదుట ధర్నా చేస్తామని సంచలన ప్రకటన చేశారు. జేపీసీ వేస్తే తప్పకుండా అదానీ జైలుకు వెళ్తారన్నారు. అదానీతో మోదీ లాలూచీ ఒప్పందం చేసుకున్నారని కీలక ఆరోపణలు చేశారు సీఎం రేవంత్.
టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. గౌతమ్ అదానీ ఆర్థిక అవకతవకలు దేశ ప్రతిష్టను దెబ్బతీశాయని, మణిపూర్లో అల్లర్లు జరిగినప్పటికీ ప్రధాని మోదీ ఇప్పటి వరకు ఆ రాష్ట్రాన్ని సందర్శించలేదని ఆరోపించారు. ఈ నిరసన కార్యక్రమం ద్వారా కాంగ్రెస్ పార్టీ, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.








