మావోయిస్టుల నుంచి ముప్పును దృష్టిలో ఉంచుకుని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు భద్రత మరింత కట్టుదిట్టం చేశారు. ప్రత్యేక భద్రతా బృందం (SSG)లో మార్పులు చేసి, అదనపు రక్షణ చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో, ముఖ్యమంత్రికి NSG (నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్), SSG, స్థానిక పోలీసు బలగాలకు అదనంగా, మరో ఆరుగురు కమాండోలతో కూడిన కౌంటర్ యాక్షన్ బృందాన్ని జత చేశారు.
ప్రత్యేక శిక్షణ
ఈ కొత్త కౌంటర్ యాక్షన్ టీమ్ SPG (స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్) ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ పొందింది. ఈ బృందం అత్యున్నత స్థాయి భద్రతా నైపుణ్యాలతో క్షణాల్లో స్పందించగలదని భద్రతా వర్గాలు వెల్లడించాయి. చంద్రబాబుకు మూడంచెల భద్రతలో తొలి వలయంలో ఎన్ఎస్జీ, రెండో వలయంలో ఎస్ఎస్జీ, వివిధ చోట్ల పర్యటనలకు వెళ్లినప్పుడు అక్కడి పోలీసు యూనిట్లకు చెందిన సాయుధ బలగాలు మూడో వలయంగా ఉంటాయి. వీరందరితో పాటు సీఎంకు కొద్ది దూరంలో నిత్యం వెన్నంటి ఆరుగురు కౌంటర్ యాక్షన్ కమాండోలు ఉంటారు.