తొక్కిస‌లాట ఘ‌ట‌న‌.. డీఎస్పీ ర‌మ‌ణ‌పై వేటు – సీఎం చంద్ర‌బాబు ప్ర‌క‌ట‌న‌

తొక్కిస‌లాట ఘ‌ట‌న‌.. డీఎస్పీ ర‌మ‌ణ‌పై వేటు - సీఎం చంద్ర‌బాబు ప్ర‌క‌ట‌న‌

తిరుపతిలో తొక్కిసలాట బాధితుల‌ను ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు ప‌రామ‌ర్శించారు. అమ‌రావ‌తి నుంచి తిరుప‌తి చేరుకున్న చంద్ర‌బాబు ముందుగా తొక్కిస‌లాట ఘ‌ట‌న జ‌రిగిన ప్ర‌దేశాన్ని ప‌రిశీలించారు. ఘ‌ట‌న ఎలా జ‌రిగింద‌ని టీటీడీ చైర్మ‌న్‌, ఈవో, అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు. అనంత‌రం ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న బాధితుల‌ను సీఎం చంద్ర‌బాబు పరామ‌ర్శించారు. ప్రభుత్వం తరఫున బాధితులకు అందిస్తున్న సహాయ కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు. బాధితుల‌కు మెరుగైన వైద్యం అందించాల‌ని ఆదేశించారు. ఈ సంద‌ర్భంగా ఈవో శ్యామలరావు, జిల్లా కలెక్టర్‌, ఎస్పీ, ఇతర అధికారులపై చంద్ర‌బాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

తొక్కిస‌లాట ఘ‌ట‌న‌పై సీఎం చంద్ర‌బాబు అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు. స‌మీక్ష అనంత‌రం చంద్ర‌బాబు మీడియాతో మాట్లాడారు. తొక్కిస‌లాట ఘ‌ట‌న దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని, మృతుల కుటుంబాల‌కు సంతాపం తెలిపారు. తొక్కిస‌లాట ఘ‌ట‌న‌పై జ్యుడీషియ‌ల్ విచార‌ణ చేప‌డ‌తామ‌న్నారు. మృతుల కుటుంబాల‌కు రూ.25 ల‌క్ష‌ల ప‌రిహారం, తీవ్రంగా గాయ‌ప‌డిన వారికి రూ.5 ల‌క్ష‌ల ఆర్థిక సాయం ప్ర‌క‌టించారు. ఎస్పీ సుబ్బారాయుడు, జేఈవో గౌత‌మి, టీటీడీ ముఖ్య భ‌ద్ర‌తాధికారి శ్రీ‌ధ‌ర్‌ను ట్రాన్స్‌ఫ‌ర్ చేస్తున్నామ‌ని, డీఎస్పీ ర‌మ‌ణ‌కుమార్‌, ఎస్వీ గోశాల డైరెక్ట‌ర్ హరినాథ్‌రెడ్డిని స‌స్పెండ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. డీఎస్పీ నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించార‌ని తేల్చారు.

ఎస్పీ సుబ్బారాయుడు ఇచ్చిన వివ‌రాల ఆధారంగా క‌లెక్ట‌ర్ నివేదిక రూపొందించారు. ఈ నివేదిక ఆధారంగానే డీఎస్పీ ర‌మ‌ణ‌కుమార్‌పై స‌స్పెండ్ వేటుప‌డిన‌ట్లుగా తెలుస్తోంది. చంద్ర‌బాబు తిరుప‌తి ప‌ర్య‌ట‌న‌కు ముందు ఎస్పీ వివ‌ర‌ణ ఆధారంగా క‌లెక్ట‌ర్ ఓ నివేదిక‌ను ముఖ్య‌మంత్రికి అంద‌జేశారు. డీఎస్పీ, అంబులెన్స్‌ డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్లే భక్తులు చనిపోయారు అని నివేదికలో వెల్లడించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment