చట్టవిరుద్ధంగా డిపాజిట్ల సేకరణ అభియోగాల కేసులో మార్గదర్శి ఎట్టకేలకు నిజాన్ని అంగీకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 18 ఏళ్లుగా న్యాయస్థానాల చుట్టూ తిరుగుతున్న ఈ కేసులో మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఎట్టకేలకు వాస్తవాన్ని తెలంగాణ హైకోర్టు ముందుంచారు. తండ్రి చేసిన నేరానికి కుమారుడిని శిక్షించాలా? అని ప్రశ్నిస్తూ, రామోజీరావు చేసిన అక్రమ డిపాజిట్ల స్వీకరణకు ఆయన కుమారుడైన ప్రస్తుత కర్త కిరణ్ బాధ్యుడు కాదని ఆ సంస్థ న్యాయవాదుల చేత వాదిస్తోంది.
హిందూ అవిభాజ్య కుటుంబం (HUF) కింద మార్గదర్శి అక్రమాలకు కేవలం రామోజీరావే బాధ్యుడని, కిరణ్పై కేసులు నమోదు చేయడం తగదని మార్గదర్శి తరపున న్యాయవాది ముకుల్ రోహత్గీ కోర్టులో వాదనలు వినిపించారు. అయితే, హైకోర్టు ఈ వాదనపై భిన్నంగా స్పందంచింది. చట్టవిరుద్ధ పనులకు బాధ్యత వహించాల్సిందే కదా..! (సివిల్ లయబిలిటీ) అని మార్గదర్శి ఫైనాన్షియర్స్కి తేల్చి చెప్పడం గమనార్హం.
ఆర్బీఐ తేల్చి చెప్పిన నిజం!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మార్గదర్శి ఫైనాన్షియర్స్పై చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేసింది. చట్టవిరుద్ధంగా డిపాజిట్లు వసూలు చేసినందుకు క్రిమినల్ ప్రొసీడింగ్స్ తప్పవని హైకోర్టుకు నివేదిక సమర్పించింది. గతంలో మార్గదర్శి కోర్టుల ముందు చేసిన వాదనలు అసత్యమని, అవి సత్యాసత్యాలు నిర్ధారించేందుకు ఇకపై విచారణ జరిపించాల్సిందేనని పేర్కొంది.
విచారణ 28కి వాయిదా
ఈ కేసును తెలంగాణ హైకోర్టు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విచారిస్తోంది. తాజా విచారణలో మార్గదర్శి తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ మాట్లాడుతూ “తండ్రి చేసిన నేరానికి కుమారుడిని శిక్షిస్తారా?” అని ప్రశ్నించారు. అయితే, “మార్గదర్శి సంస్థ తన కార్యకలాపాలు కొనసాగిస్తున్నప్పటికీ, గతంలో చేసిన తప్పులకు బాధ్యత వహించకపోతే ఎలా?” అని హైకోర్టు తిరిగి ప్రశ్నించింది. ఈ విచారణకు మరింత స్పష్టత వచ్చేలా హైకోర్టు తదుపరి విచారణను ఫిబ్రవరి 28కి వాయిదా వేసింది.
మార్గదర్శి సంస్థ వైఖరిపై బయట భిన్నమైన వాదనలు నడుస్తున్నాయి. తండ్రి రామోజీరావు సంపాదించిన ఆస్తులు, వ్యాపారాలు పంచుకుంటారు కానీ, తప్పుల విషయంలో మాత్రం తండ్రి మీదకు నెట్టేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తారా..? అని ప్రశ్నిస్తున్నారు.