ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి సర్కిల్ ఇనిస్పెక్టర్ లీగల్ నోటీసులు పంపించడం సంచలనంగా మారింది. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం(CM) చంద్రబాబు (Chandrababu)కు సీఐ శంకరయ్య (CI Shankarayya) నోటీసులు పంపించడం చర్చనీయాంశంగా మారింది. విషయం ఏమిటంటే.. వైసీపీ నేత, స్వర్గీయ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు సమయంలో పులివెందుల సీఐగా విధులు నిర్వహించిన శంకరయ్య తాజాగా సీఎం చంద్రబాబుకు లీగల్ నోటీసులు (Legal Notices) జారీ చేశారు.
వివేకా హత్య కేసుకు సంబంధించిన ఆధారాలను తాను ధ్వంసం చేశానని చంద్రబాబు అసత్య ఆరోపణలు చేశారంటూ ఈనెల 18న నోటీసులు పంపినట్టు సీఐ శంకరయ్య తెలిపారు. ఈ ఆరోపణలు తన ప్రతిష్ఠకు తీవ్రంగా భంగం కలిగించాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నోటీసుల్లో భాగంగా, అసెంబ్లీలో బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా, తాను ఎదుర్కొన్న మానసిక, సామాజిక నష్టం దృష్ట్యా రూ.1.45 కోట్ల పరిహారం చెల్లించాలని కూడా స్పష్టం చేశారు.
ఈ పరిణామంతో వివేకా హత్య కేసు చుట్టూ మళ్లీ చర్చ మొదలైంది. రాజకీయ నేతల ఆరోపణలు, ప్రతిఆరోపణలు పోలీసు అధికారుల గౌరవం, నమ్మకాన్ని దెబ్బతీస్తున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇకపై ఈ నోటీసులకు సీఎం చంద్రబాబు తరఫు నుంచి ఏ విధమైన స్పందన వస్తుందో చూడాల్సి ఉంది.







