తెలుగుదేశం పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడురాష్ట్ర అభివృద్ధిపై తన ప్రత్యేక దృష్టిని వెల్లడించారు. రాష్ట్రం అభివృద్ధి సాధించాలంటే కఠిన శ్రమ చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. కుప్పం పర్యటనలో ఉన్న ఆయన ‘స్వర్ణ కుప్పం – విజన్ 2029’ డాక్యుమెంట్ ఆవిష్కరించారు. అనంతరం కుప్పం ప్రజలతో మాట్లాడారు.
చంద్రబాబు తన ప్రసంగంలో రాష్ట్ర అభివృద్ధికి ఉద్దేశించిన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కుప్పం అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి, ఉపాధి కల్పనపై దృష్టి సారించామని తెలిపారు. కుప్పంలో పెట్టుబడులు తీసుకువచ్చి ఉపాధి అవకాశాలు పెంచుతామని చెప్పారు. ప్రతి ఇంటికీ పారిశ్రామికవేత్త ఉండాలనేది తన విజన్ అని స్పష్టం చేశారు. జీవితం ఎవరికీ జాక్పాట్ కాదు. ఒక అవకాశం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. లేకపోతే వైకుంఠపాళి తరహా పరిస్థితే ఎదురవుతుంది అని చంద్రబాబు పేర్కొన్నారు.
టీడీపీ ఆవిర్భావం తర్వాత కుప్పం ప్రజలు తన పక్షాన నిలబడ్డారని చంద్రబాబు అన్నారు. స్వర్ణకుప్పం డాక్యుమెంట్పై చర్చలు జరిపి, తమ సలహాలను అందించాలన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే నిజమైన నాయకత్వ లక్షణం అని, అలాంటి నేతలు శాశ్వతంగా ప్రజల మనసుల్లో ఉంటారని చంద్రబాబు తన ప్రసంగంలో ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.