తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో సీనియర్ నేతలను పక్కనపెట్టడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే కోటాకు సంబంధించి ఖాళీ అయిన ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు గానూ, కూటమి పార్టీల వాటాలో భాగంగా టీడీపీ మూడు సీట్లు దక్కాయి. మూడు సీట్లకు అభ్యర్థులను ఖరారు చేస్తూ ఆదివారం సాయంత్రం ఆ పార్టీ జాబితాను విడుదల చేసింది.
తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన లిస్ట్ ఆ పార్టీ సీనియర్లకు భారీ షాక్ ఇచ్చింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సీటు కోసం గంపెడంత ఆశలు పెట్టుకున్న సీనియర్లు యనమల రామకృష్ణుడు, అశోక్ బాబు, దువ్వారపు రామారావు, ఎన్వీఎస్ఎస్ వర్మ లాంటి కీలక నేతల పేర్లు ఎవ్వరివీ లేకపోవడం వారిని షాక్కు గురిచేసింది. దీంతో లోకేశ్ వర్గానికే టీడీపీ ప్రాధాన్యం ఇస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
వైసీపీ నుంచి టీడీపీలో చేరిన జంగా కృష్ణమూర్తికి కూడా అవకాశం రాకపోవడం, ఎస్వీఎస్ఎన్ వర్మ, దేవినేని ఉమా మహేశ్వరరావుల పేర్లు కూడా పరిగణనలోకి రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇది పార్టీ పునర్నిర్మాణంలో భాగమా? లేదా వర్గపోరుకు నాంది పలుకుతుందా..? అని ఆ పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.