ఆంధ్రప్రదేశ్ లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బిల్ గేట్స్ రాష్ట్రానికి చేరుకొని నారా చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారు. గన్నవరం వచ్చిన ఆయనకు నారా లోకేష్, ఇతర మంత్రులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంకు చేరుకున్న గేట్స్కు సీఎం, పవన్ కళ్యాణ్తో పాటు మంత్రులు ఘనస్వాగతం పలికారు.
ఆర్టీజీఎస్, సంజీవనిపై చర్చలు
సచివాలయంలో రియల్ టైమ్ గవర్నెన్స్ కేంద్రాన్ని గేట్స్ సందర్శించారు. టెక్నాలజీ ఆధారంగా ప్రజలకు వేగంగా, పారదర్శకంగా సేవలు అందించేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలను సీఎం వివరించారు. బిల్ & మెలిండా గేట్స్ ఫౌండేషన్ సహకారంతో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో జరుగుతున్న ప్రాజెక్టులను మరింత విస్తరించే అంశంపై చర్చ జరిగింది. ముఖ్యంగా సంజీవని ప్రాజెక్టు పురోగతిని వివరించారు. ఈ భేటీలో గేట్స్ బృందం సభ్యులు మైఖేల్ థియోడార్ జాయోగృలస్, క్రిస్టియాన మరియా ఇస్కుందర్, అంకుర్ చంద్రకాంత్ ఓరా, అర్చన వ్యాస్ కూడా పాల్గొన్నారు.








