జ‌వ‌హ‌ర్‌రెడ్డితో మీటింగ్ అబ‌ద్ధం.. ఆ అధికారి బదిలీ వెనుక అసలు ‘క‌థ‌’ ఇదే?

జ‌వ‌హ‌ర్‌రెడ్డితో మీటింగ్ అబ‌ద్ధం.. ఆ అధికారి బదిలీ వెనుక అసలు 'క‌థ‌' ఇదే!

ప్ర‌భుత్వాధినేత‌కు ప‌రిపాల‌న‌పై ప‌ట్టు ఉండాలి. వ్య‌వ‌స్థ‌ల‌పై, అధికార‌గ‌ణంపై పూర్తిస్థాయి విశ్వాసం, న‌మ్మ‌కం ఉండాలి. పాల‌న‌లో ఘోర వైఫ‌ల్యం చెందిన‌ప్పుడు, ప్ర‌జ‌ల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త వ‌స్తున్న‌ప్పుడు పాల‌కుడికి అభ‌ద్ర‌తాభావం పెరిగిపోతుంది. ఆ అభ‌ద్ర‌తాభావంలో త‌న నీడ‌ను చూసి కూడా భ‌య‌ప‌డే ప‌రిస్థితులు వ‌స్తాయి. రాష్ట్రంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు (Nara Chandrababu Naidu) తాజాగా కొంద‌రు ఐఏఎస్(IAS) ల‌పై చ‌ర్య‌లు తీసుకోవ‌డం వెనుక ఈ అభ‌ద్ర‌తా భావ‌మే కార‌ణ‌మ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

జవహర్ రెడ్డి మీటింగ్.. అంతా అబద్ధం!
మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి (K.S. Jawahar Reddy) హైదరాబాద్‌లో (Hyderabad) కొంతమంది ఐఏఎస్ అధికారులతో రహస్య సమావేశం నిర్వహించారని, నెల్లూరులో (Nellore) ఒక అధికారి ఇంటి వివాహ వేడుకకు హాజరయ్యారని వచ్చిన వార్తల్లో ఏమాత్రం నిజం లేదని స్పష్టమవుతోంది. అసలు జవహర్ రెడ్డి ఆ వివాహానికే వెళ్లనప్పుడు, అక్కడ ఐఏఎస్ అధికారి నీలకంఠారెడ్డి (Neelakantha Reddy) ఆయన్ని కలిశారన్న ప్రచారంలో అర్థం లేదు. కేవలం కొన్ని పత్రికల్లో వచ్చిన ఊహాజనిత కథనాలను నమ్మి, నీలకంఠారెడ్డిపై బదిలీ వేటు వేయడం చూస్తుంటే ప్రభుత్వం తన సొంత ఇంటెలిజెన్స్ వ్యవస్థల కంటే ‘గాసిప్స్’ (Gossips)కే ఎక్కువ విలువ ఇస్తోందని అర్థమవుతోందంటున్నారు విశ్లేష‌కులు.

వ్యవస్థలపై నమ్మకం లేదా?
రాష్ట్రంలో పటిష్టమైన ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ వ్యవస్థలు ఉన్నాయి. నిజంగానే ఒక సీనియర్ అధికారి మాజీ సీఎస్‌ను కలిస్తే ఆ నివేదిక ప్రభుత్వం వద్ద ఉండాలి. కానీ, అవేమీ లేకుండానే కేవలం అనుమానంతో చర్యలు తీసుకోవడం అధికారుల మనోధైర్యాన్ని దెబ్బతీస్తోంది. “పాలనలో విజ్ఞత కోల్పోయి, నీడను చూసి భయపడే పరిస్థితికి ముఖ్యమంత్రి చేరుకున్నారా?” అని అధికార వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.

అప్పుడు గౌరవం.. ఇప్పుడు అవమానం!
గతంలో వైఎస్ జగన్ హయాంలో చంద్రబాబు కోటరీలో పనిచేసిన ప్రద్యుమ్న (Pradyumna), గిరిధర్ (Giridhar), ప్రవీణ్ ప్రకాష్ (Praveen Prakash) వంటి అధికారులకు సైతం సముచిత స్థానం కల్పించి, వారి అనుభవాన్ని వాడుకున్నారు తప్ప ఎక్కడా కక్ష సాధింపులకు పాల్పడలేదని గుర్తుచేసుకుంటున్నారు. కానీ నేడు పరిస్థితి దానికి భిన్నంగా ఉంది. అధికారులను వర్గాలుగా విడగొట్టి, వారిపై నిఘా ఉంచి వేధించడం ఏ రకమైన పరిపాలన అని మేధావులు ప్రశ్నిస్తున్నారు.

తెరవెనుక ‘పూర్ణచంద్ర’ నాటకం?
నీలకంఠారెడ్డి బదిలీ వెనుక ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్‌లో చక్రం తిప్పుతున్న ఒక అధికారి హస్తం ఉందనే చర్చ జోరుగా సాగుతోంది. సదరు అధికారి లోకేష్(Lokesh) సామాజికవర్గానికి చెందిన వాడు కావడం, తిరుమలలో తన పరిధి దాటి ప్రవర్తించడాన్ని నీలకంఠారెడ్డి మందలించడమే ఈ వివాదానికి కారణమని తెలుస్తోంది. తన పలుకుబడిని ఉపయోగించి అదనపు ఈవో ద్వారా తప్పుడు ఫిర్యాదులు చేయించి, నీలకంఠారెడ్డిని బదిలీ చేయించారనే ఆరోపణలు బ్యూరోక్రసీని విస్మయానికి గురిచేస్తున్నాయి.

పాలన గాడితప్పుతోందా?
అధికారులు స్వేచ్ఛగా పనిచేసే వాతావరణం లేనప్పుడు పరిపాలన కుంటుపడుతుంది. అధికారులను భయపెట్టి, కక్ష సాధింపులు చేస్తే పౌర సేవలు బలహీనపడతాయి. అభివృద్ధిని గాలికొదిలేసి, అధికారుల వ్యక్తిగత విషయాలపై నిఘా పెట్టడం ప్రజాస్వామ్యానికే ప్రమాదకరం. జరగని సమావేశాలను జరిగాయని నమ్మి చర్యలు తీసుకోవడం బాబు సర్కార్ అపహాస్యం పాలవడమేనని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment