కేంద్ర ప్రభుత్వం ఈరోజు పార్లమెంటులో 2025-26 కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్ను ప్రకటించనున్నారు. ఈ బడ్జెట్లో రైతులు, పేదలు, మహిళలు, యువతపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సమాచారం. ముఖ్యంగా పన్నుల తగ్గింపుతో పాటు, గ్రామీణ ప్రజలకు గృహ నిర్మాణ సహాయం అందించేందుకు కొత్త పథకాలు ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. పలు రంగాల్లో పన్నులు తగ్గించే అవకాశం ఉండగా, ఆర్థిక రంగంపై ప్రభుత్వ ఉద్దేశం ఏమిటో చూడాలి. మరిన్ని వివరాలు అధికారిక ప్రకటన తర్వాత తెలియనున్నాయి.
ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టడం వరుసగా ఇది ఎనిమిదవ సారి కావడం గమనార్హం. ఆకాశాన్నంటిన ధరలు, జీఎస్టీ చెల్లింపులతో సతమతమవుతున్న మధ్య తరగతి ప్రజలు ఈసారైనా కేంద్రం పన్ను భారాన్ని తగ్గించనుందా అని ఆశలతో ఎదురుచూస్తున్నారు. మరి కేంద్రం ఎలాంటి బడ్జెట్ ప్రవేశపెట్టబోతోందో వేచి చూడాలి.