ఐపీఎల్ 2025 (IPL 2025)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) విజయం తర్వాత నిర్వహించిన కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోవడం, అనేక మంది గాయపడటంపై సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (CAT) తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనకు ఆర్సీబీనే బాధ్యత వహించాలని పేర్కొంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది.
“మూడు నుంచి ఐదు లక్షల మంది ప్రజలు గుమిగూడేలా చేసినందుకు ఆర్సీబీ ప్రాథమికంగా బాధ్యత వహించనట్లు కనిపిస్తోంది. ఆర్సీబీ పోలీసుల నుంచి తగిన అనుమతి, సమ్మతి తీసుకోలేదు. అకస్మాత్తుగా, వారు సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లో పోస్ట్ చేశారు. దీంతోనే ప్రజలు గుమిగూడారు” అని ట్రిబ్యునల్ వ్యాఖ్యానించింది. ఆర్సీబీ చివరి నిమిషంలో విజయోత్సవ కార్యక్రమం గురించి ప్రకటించడాన్ని ట్రిబ్యునల్ తీవ్రంగా విమర్శించింది.
“ఆర్సీబీ ముందస్తు అనుమతి లేకుండా న్యూసెన్స్ క్రియేట్ చేసింది. దాదాపు 12 గంటల తక్కువ సమయంలో పోలీసులు అన్ని ఏర్పాట్లు చేస్తారని ఆశించలేము” అని ట్రిబ్యునల్ పేర్కొంది. ఈ విషయంలో పోలీసులను పూర్తిగా సమర్థించింది. “పోలీస్ సిబ్బంది కూడా మనుషులే. వారు దేవుళ్లు కాదు, మాంత్రికులు కాదు, అల్లాద్దీన్ అద్భుత దీపం వంటి శక్తులు లేవు. తగిన సమయం లేకపోవడంతో ఏర్పాట్లు చేయలేకపోయారు. పోలీసులకు తగిన సమయం ఇవ్వలేదు” అని స్పష్టం చేసింది.
తొక్కిసలాట ఘటనపై తన సస్పెన్షన్ను సవాల్ చేస్తూ ఓ బెంగళూరు పోలీస్ అధికారి వేసిన పిటిషన్ను విచారిస్తూ ట్రిబ్యునల్ ఈ వ్యాఖ్యలు చేసింది.