లాయ‌ర్ల‌ను అనుమ‌తిస్తేనే.. విచార‌ణ‌కు వ‌స్తా – కేటీఆర్

లాయ‌ర్ల‌ను అనుమ‌తిస్తేనే.. విచార‌ణ‌కు వ‌స్తా - కేటీఆర్

ఫార్ములా ఈ-రేస్ కేసులో నిధుల దుర్వినియోగం ఆరోపణలపై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ విచారణకు బ‌య‌ల్దేరారు. ఈ సంద‌ర్భంగా ఏసీబీ కార్యాల‌యం వ‌ద్ద పోలీసులు కేటీఆర్ కాన్వాయ్‌ని ఆపారు. లీగ‌ల్ టీమ్‌ను అనుమ‌తించ‌బోమ‌ని, కేటీఆర్ ఒక్క‌రే విచార‌ణ‌కు హాజ‌రుకావాల‌ని సూచించారు. లాయ‌ర్ల స‌మ‌క్షంలో విచార‌ణ జ‌ర‌గాల‌ని, త‌న‌తో లాయ‌ర్ వ‌స్తే ఇబ్బంది ఏంట‌ని ప్ర‌శ్నించారు.

ఈ సంద‌ర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. పోలీసుల‌పై న‌మ్మ‌కం లేదు కాబ‌ట్టే త‌న లాయ‌ర్ల‌తో వచ్చాన‌ని చెప్పారు. చ‌ట్టాల‌ను గౌర‌వించే వ్య‌క్తిని కాబ‌ట్టే ఏసీబీ విచార‌ణ‌కు వ‌చ్చాన‌ని చెప్పారు. లాయ‌ర్ల‌ను అనుమ‌తిస్తేనే విచార‌ణ‌కు వ‌స్తాన‌ని తేల్చిచెప్పారు. లాయ‌ర్ ఉంటే వాళ్ల‌కు వ‌చ్చిన ఇబ్బంది ఏంటి అని ప్ర‌శ్నించారు. త‌న‌ను ఏసీబీ విచార‌ణ‌కు పిలిచి, త‌న‌ ఇంటిపై రైడ్ చేయాల‌ని చూస్తున్నార‌ని, ఇంట్లో వాళ్లే ఏదో ఒక‌టి పెట్టి కేసుల్లో ఇరికించాల‌ని కుట్ర చేస్తున్నారని కేటీఆర్ అనుమానం వ్య‌క్తం చేశారు.

ప‌ట్నం న‌రేంద‌ర్‌రెడ్డి విష‌యంలో పోలీసులు త‌ప్పుడు స్టేట్‌మెంట్ రికార్డు చేశారని, త‌న‌ విష‌యంలో అలా జ‌ర‌గ‌ద‌న్న న‌మ్మ‌కం లేద‌న్నారు. కోర్టులో తీర్పు రిజ‌ర్వ్ అయ్యాక పోలీసుల డ్రామాలు ఏంటో అని కేటీఆర్ ప్ర‌శ్నించారు. తాను చెప్ప‌నిది చెప్పిన‌ట్లుగా రాసుకోలేక‌నే లాయ‌ర్లు వ‌ద్దంటున్నారని, డ్రామాల‌తో డైవ‌ర్ష‌న్ చేయ‌డం త‌ప్ప మ‌రొక‌టి కాద‌న్నారు. వాళ్లు అడుగుతున్న స‌మాచారం ప్ర‌భుత్వం వ‌ద్దే ఉంద‌న్నారు. ప్ర‌జాక్షేత్రంలో సీఎం రేవంత్‌ను వ‌దిలిపెట్టే ప్ర‌స‌క్తే లేద‌ని, అన్నింటినీ న్యాయ‌ప‌రంగా ఎదుర్కొంటామ‌న్నారు.

కేటీఆర్‌ విచారణ నేపథ్యంలో రాష్ట్ర పోలీసులు అప్రమత్తమై, ఏసీబీ కార్యాలయంతో పాటు తెలంగాణ భవన్ ఎదుట భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ముఖ్య నేతలను ముందస్తు అరెస్టులు చేశారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, 100 మందికి పైగా పార్టీ నాయకులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, బీఆర్ఎఎస్ నేత మేకల విద్యా సాగర్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment