ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో మాజీ మంత్రి, బీజేపీ (BJP) ఎమ్మెల్యే (MLA) ఆదినారాయణరెడ్డి (Adinarayana Reddy) తీరు వివాదాస్పదంగా మారింది. గతంలో పేకాట స్థావరాల విషయంలో సొంత పార్టీ ఎంపీ (MP)తో కయ్యానికి కాలుదువ్విన ఆది.. తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. వైఎస్సార్ జిల్లా (YSR District) జమ్మలమడుగు నియోజకవర్గంలో బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సిమెంట్ పరిశ్రమలపై (Cement Industries) తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నట్లు ఆరోపణలు తీవ్రమయ్యాయి. సిమెంట్ ముడి సరుకుల (Raw Materials) రవాణా కాంట్రాక్ట్ (Transportation Contracts) మొత్తం తన అనుచరులకు అప్పగించాలని సిమెంట్ సంస్థలపై ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే కొన్ని కాంట్రాక్టులు ఇచ్చినా, అవి చాలవంటూ మొత్తం ఇవ్వాలని సదరు కంపెనీలను డిమాండ్ చేస్తున్నారు.
అడ్డుకున్న ఆది అనుచరులు..
ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి డిమాండ్కు సిమెంట్ సంస్థలు స్పందించకపోవడంతో, ఆయన అనుచరులు పరిశ్రమలకు అవసరమైన ముడిసరకులైన ఫ్లైయాష్, సున్నపురాయి రవాణా రహదారులను అడ్డుకున్నారు. దీంతో చిలమకూరు ప్లాంట్ (Chilamkur Plant)లో సిమెంట్ ఉత్పత్తి నిలిచిపోయింది. ఎర్రగుంట్లలోని మరో ప్లాంట్లో కూడా ఉత్పత్తి నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది.
అన్ని కాంట్రాక్టులు తనకే కావాలని..
ఎర్రగుంట్లలోని రాయలసీమ థర్మల్ విద్యుత్ కేంద్రం (Rayalaseema Thermal Power Plant) నుంచి ఫ్లైయాష్ (Fly Ash) రవాణా చేసే లారీలను నిలిపివేశారు. అలాగే సున్నపురాయి (Limestone) రవాణాకు కూడా ఆటంకాలు ఏర్పడ్డాయి. మార్గం మధ్యలో బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అనుచరులు మినీ బస్సును అడ్డంగా నిలిపి లారీల రాకను అడ్డుకున్నారు. సిమెంట్ కంపెనీలు ఇప్పటికే కొంతమంది కాంట్రాక్టర్లతో ఒప్పందాలు చేసుకున్నట్లు పేర్కొంటున్నా, ఎమ్మెల్యే వాటిని పరిగణనలోకి తీసుకోకపోవడం గమనార్హం. మొత్తంగా తన అనుచరులకే అన్ని కాంట్రాక్టులు రావాలన్న డిమాండ్తో పరిశ్రమల కార్యకలాపాలను అడ్డుకుంటున్నారని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి.