చేతులెత్తేసిన పిటిష‌న‌ర్‌.. – గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో బిగ్ ట్విస్ట్

గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో బిగ్ ట్విస్ట్

గ‌న్న‌వ‌రం తెలుగుదేశం పార్టీ కార్యాల‌యంపై దాడి కేసులో సంచ‌ల‌న విష‌యం బ‌య‌ట‌ప‌డింది. ఈ కేసులో పోలీసుల కుట్రను పిటిష‌న‌ర్ ముదునూరి సత్యవర్ధన్ బ‌య‌ట‌పెట్టారు. ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయ‌స్థానం మేజిస్ట్రేట్ ఎదుట‌ పోలీసుల ఒత్తిడిని సత్యవర్ధన్ బ‌హిర్గ‌తం చేశారు. పోలీసులను నుంచి త‌న‌కు రక్షణ కల్పించాలని జడ్జిని సత్యవర్ధన్ వేడుకున్నారు. తాను వేసిన పిటిష‌న్‌ను విరమించుకునేందుకు అనుమ‌తి ఇవ్వాల్సిందిగా ఫిర్యాదు దారుడు సత్యవర్ధన్ జ‌డ్జిని కోరిన‌ట్లుగా తెలుస్తోంది.

గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో త‌న‌కు ఎలాంటి సంబంధం లేద‌ని, స్వ‌యంగా స‌త్య‌వ‌ర్ధ‌న్ అఫిడవిట్ సమర్పించార‌ని, సాక్షిగా పిలిచి సంతకం చేయించుకున్నారని కోర్టుకు ఆయ‌న‌ స్పష్టం చేశారు. త‌నను ఎవ‌రూ కులంపేరుతో దూషించలేదని కోర్టు ముందు అంగీక‌రించారు. స‌త్య‌వ‌ర్ధ‌న్‌ గ‌న్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాల‌యంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నారు. కాగా, ఆఫీస్‌పై దాడి సమయంలో సత్యవర్ధన్‌ను కులం పేరుతో దూషించి, బెదిరించారంటూ పోలీసులు కేసు నమోదు చేసిన విష‌యం తెలిసిందే.

ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ స‌త్య‌వ‌ర్ధ‌న్‌ న్యాయమూర్తిని ఆశ్రయించగా, న్యాయమూర్తి స్వయంగా సత్యవర్ధన్ స్టేట్ మెంట్‌ను రికార్డ్ చేసుకున్నారు. సత్యవర్ధన్‌కు, అతని కుటుంబానికి రక్షణ కల్పించాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. దాడి జరిగినప్పుడు తాను సంఘ‌ట‌న స్థ‌లంలో లేన‌ని, ఈ కేసుతో త‌నకు ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ త‌నకు ఎలాంటి సంబంధం లేదని, త‌న‌తో సాక్షి సంతకం మాత్రమే తీసుకున్నారని న్యాయ‌స్థానం ముందు అంగీక‌రించారు. అంతకుమించి త‌నకేమీ తెలియదని, కేసును విరమించుకుంటున్నట్లు జ‌డ్జికి స‌త్య‌వ‌ర్ధ‌న్ విన్న‌వించుకున్న‌ట్లు స‌మాచారం.

Join WhatsApp

Join Now

Leave a Comment