కాంగ్రెస్ పార్టీ శాసనమండలి సభ్యుడు తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్కు బిగ్ షాక్ తగిలింది. మల్లన్నను కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేస్తూ క్రమశిక్షణ కమిటీ సంచలన ప్రకటన విడుదల చేసింది. ఫిబ్రవరి 5వ తేదీన షోకాజ్ నోటీసులు ఇవ్వగా, ఆ నోటీసులపై ఇప్పటి వరకు మల్లన్న సమాధానం ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చర్చలకు ఉపక్రమించింది.
గత కొంతకాలంగా తీన్మార్ మల్లన్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదులు అందుతున్నాయి. ఇటీవల నిర్వహించిన బీసీ సభలోనూ తీన్మార్ మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం చేపడుతున్న బీసీ కులగణనను సైతం వ్యతిరేకించాలని పిలుపునిచ్చాడు. అంతేకాకుండా ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదాన్ని పరిశీలించేందుకు వెళ్లిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిపై కూడా వ్యంగ్యంగా మాట్లాడారు. దీంతో నోటీసులు ఇచ్చినప్పటికీ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న తీన్మార్ మల్లన్నపై పార్టీ అధిష్టానం చర్యలు తీసుకుంది. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ప్రకటన విడుదల చేసింది.
