భారతదేశ టెలికాం దిగ్గజం ఎయిర్టెల్(Airtel), ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్(SpaceX)తో కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా స్టార్లింక్(Starlink) హై-స్పీడ్ ఇంటర్నెట్(Internet) సేవలను భారతదేశానికి అందించనున్నారు. ఈ వార్తను ఎయిర్టెల్ అధికారికంగా ప్రకటించింది.
భారతీ ఎయిర్టెల్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు వైస్ చైర్మన్ గోపాల్ విట్టల్ మాట్లాడుతూ, “భారతదేశంలోని మా కస్టమర్లకు స్టార్లింక్ సేవలను అందించడానికి స్పేస్ఎక్స్తో కలిసి పనిచేయడం మా కోసం ఒక ముఖ్యమైన మైలురాయి. నూతన తరం ఉపగ్రహ కనెక్టివిటీకి ఇది మేము చూపుతున్న నిబద్ధతను మరింత బలపస్తుంది” అని తెలిపారు.
స్టార్లింక్ పరికరాలు ఎయిర్టెల్ స్టోర్లలో అందుబాటులోకి రావచ్చని సమాచారం. ముఖ్యంగా గ్రామీణ పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, మారుమూల ప్రాంతాలు, వ్యాపారాల వరకు హై-స్పీడ్ ఇంటర్నెట్ను తీసుకురావడం కోసం ఈ సేవలు వినియోగించబడే అవకాశముంది. ఇప్పటికే ఎయిర్టెల్ యూటెల్సాట్ వన్వెబ్తో కలిసి శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను అందిస్తోంది. ఇప్పుడు స్టార్లింక్ భాగస్వామ్యంతో, దేశంలోని ఇంటర్నెట్ కనెక్టివిటీ తక్కువగా ఉన్న ప్రాంతాలను మరింతగా కవర్ చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది.
స్పేస్ఎక్స్ ప్రెసిడెంట్ గ్విన్ షాట్వెల్ మాట్లాడుతూ “ఎయిర్టెల్తో కలిసి పనిచేయడానికి మేము చాలా ఉత్సాహంగా ఉన్నాం. స్టార్లింక్ ద్వారా భారతదేశ ప్రజలకు విప్లవాత్మకమైన మార్పులను తీసుకురావడం మాకు గర్వకారణం. ఈ కనెక్టివిటీ ద్వారా ప్రజలు, వ్యాపారాలు, సంస్థలు చేసే అద్భుతమైన పనులను చూడగలమనే నమ్మకం ఉంది” అని పేర్కొన్నారు.