తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్యమంత్రి పదవిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఐదేళ్లు రేవంత్రెడ్డే ముఖ్యమంత్రిగా ఉంటారని, భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రానికి బీసీ (బ్యాక్వర్డ్ క్లాస్) నేత ముఖ్యమంత్రి కావడానికి అవకాశం ఉందని వెల్లడించారు.
సోమవారం గాంధీ భవన్లో ఏఐసీసీ (ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ) ఓబీసీ విభాగం అధ్యక్షుడు అజయ్ సింగ్తో కలిసి మీడియా సమావేశం నిర్వహించిన మహేష్ గౌడ్, రాబోయే రోజుల్లో తెలంగాణకు బీసీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే బీసీలకు రాజ్యాధికారం ఇవ్వగలదని చెప్పారు. రాబోయే కేబినెట్ విస్తరణలో బీసీలకు అధిక ప్రాధాన్యత ఉంటుందని మహేష్ గౌడ్ చెప్పారు. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని కూడా బీజేపీ నేతలను ఛాలెంజ్ చేశారు.