సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళికి న్యాయస్థానాలు బిగ్ రిలీఫ్ కల్పించాయి. ఆయనపై నమోదైన అన్ని కేసుల్లోనూ న్యాయస్థానాలు బెయిల్ మంజూరు చేశాయి. నిన్న నరసరావుపేట కోర్టు బెయిల్ మంజూరు చేయగా, ఇవాళ ఆదోని, విజయవాడ కోర్టుల్లో పోసానికి బెయిల్స్ మంజూరయ్యాయి. అంతకుముందే రాజంపేట కోర్టు సైతం పోసానిపై నమోదైన కేసులో బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
రాష్ట్ర వ్యాప్తంగా పోసాని కృష్ణమురళిపై చంద్రబాబు ప్రభుత్వం 17 కేసులు నమోదు చేసింది. మహాశివరాత్రి రోజు (ఫిబ్రవరి 28)న హైదరాబాద్లో అన్నమయ్య జిల్లా ఓబుళవారిపల్లె పోలీసులు అరెస్టు చేశారు. మనోభావాలు దెబ్బతిన్నాయని జనసేన నేతల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు పోసానిపై కేసులు నమోదయ్యాయి. అన్నమయ్య పోలీసుల అరెస్టు తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పోసానిపై కేసులు బుక్చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న పోసానిని ఒక్కో కేసులో పీటీ వారెంట్ కోరుతూ వేల కిలోమీటర్లు తిప్పారు.
కాగా, పోసాని కేసుల విషయంలో ప్రతిపక్ష వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది. పిటిషన్ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం పోసానిపై నమోదైన కేసుల్లో 35A నోటీసు ఇవ్వాలన్న ఆదేశించింది. విశాఖపట్నం వన్ టౌన్లో నమోదైన కేసులో పూర్తిగా విచారణను నిలిపేయాలని సూచించింది. హైకోర్టు ఆదేశాల తర్వాత దిగువ కోర్టుల్లో వైసీపీ తన వాదనలు వినిపించింది. దీంతో ఒక్కో కేసులో పోసాని బెయిల్ పొందుతూ వచ్చారు. అన్ని కేసుల్లో బెయిల్ పొందిన పోసాని రేపు విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.







