బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ – వైఎస్ జ‌గ‌న్‌

బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ - వైఎస్ జ‌గ‌న్‌

ఎన్నికల ముందు బాబు ష్యూరిటీ.. భవిష్యత్‌ గ్యారెంటీ నినాదం, ఎన్నికల తర్వాత బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీగా మారిపోయింద‌ని వైసీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ అన్నారు. అసెంబ్లీలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఇప్పటికి రెండుసార్లు బడ్జెట్‌ ప్రవేశపెట్టింద‌ని, అందులోని కేటాయింపులు చూస్తే ప్ర‌భుత్వం అన్ని రకాలుగా ప్రజలను మోసం చేసిన తీరు స్పష్టంగా కనిపిస్తుందన్నారు. ‘పరనింద.. ఆత్మస్తుతి’ గవర్నర్‌ ప్రసంగంతో పాటు, బడ్జెట్‌లోనూ అదే ప్ర‌స్పుటంగా క‌నిపిస్తుంద‌న్నారు. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం కోసం ప్ర‌చురిత‌మైన పుస్త‌కంలో గ‌వ‌ర్న‌ర్ చేత 4 ల‌క్ష‌ల ఉద్యోగాలు ఇచ్చేశామ‌ని అబ‌ద్ధాలు చెప్పించారన్నారు.

ఎంతసేపూ వైసీపీ పాల‌న‌, జగన్ మీదే విమర్శలు త‌ప్ప‌.. ఎన్నికల ముందు కూట‌మి ఇచ్చిన‌ హామీల విషయం ఏమిటన్నది మాత్రం చెప్పడం లేద‌న్నారు. సూపర్‌సిక్స్, మేనిఫెస్టోలో 143 హామీల గురించి అడిగితే సమాధానం రావ‌డం లేద‌న్నారు.

సూప‌ర్ సిక్స్ ప‌థ‌కాల‌కు ఏడాదికి రూ.79,867 కోట్లు అవ‌స‌రం కాగా చంద్ర‌బాబు ప్ర‌భుత్వం కేవ‌లం రూ.17,179 కోట్లు మాత్ర‌మే బ‌డ్జెట్‌లో కేటాయించింద‌న్నారు. అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్‌లో రూ.7,282 కోట్లు కేటాయించి, రూ.865 కోట్లు మాత్ర‌మే ఖ‌ర్చు చేసింద‌న్నారు. బాబు షూరిటీ.. మోసం గ్యారెంటీకి బ‌డ్జెట్ కేటాయింపులే నిద‌ర్శ‌నమ‌న్నారు.

18 నుంచి 59 ఏళ్ల మ‌హిళ‌ల‌కు నెల‌కు రూ.1500 అందిస్తామ‌న్న‌ ఆడ‌బిడ్డ నిధి ప‌థ‌కానికి కేటాయింపులే లేవ‌ని, నిరుద్యోగు భృతికి, మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప‌థ‌కానికి పైసా కూడా కేటాయించకుండా వారిని మోసం చేశాడ‌న్నారు. ఎలాగూ అమ‌లు చేసే ప‌రిస్థితి లేదు కాబ‌ట్టి, కేటాయింపులు కూడా అర‌కొర‌గా జ‌రిపార‌న్నారు. స్కూల్‌కు వెళ్లే విద్యార్థులు ఎంత‌మంది ఉన్నారు.. 18 నుంచి 59 ఏళ్ల మ‌ధ్య ఉన్న మ‌హిళ‌ల వివ‌రాలు తెలుసుకోవ‌డానికి రాకెట్ సైన్స్ అవ‌స‌ర‌మా..? మ‌హిళ‌ల కోసం ఓట‌ర్ లిస్ట్‌, స్కూల్‌కు వెళ్లే విద్యార్థుల కోసం డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేష‌న్ అండ్ లిట్ర‌సీ వెబ్‌సైట్‌లో వెతికితే తెలిసిపోతుంద‌న్నారు. ప‌థ‌కాలు అమ‌లు చేసేందుకు మ‌నసురాక కుంటిసాకులు చెబుతున్నార‌ని వైఎస్ జ‌గ‌న్ ఆరోపించారు.

బ‌డ్జెట్ డాక్యుమెంట్ల‌లో రాష్ట్ర అప్పులు ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేయాల్సి ఉండ‌గా, అప్పుల ప్ర‌స్తావ‌నే లేకుండా చేశార‌న్నారు. అప్పుల గురించి బ‌డ్జెట్‌లో ప్ర‌చురిస్తే.. రూ.10 ల‌క్ష‌ల కోట్లు, రూ.12 ల‌క్ష‌ల కోట్లు అని వైసీపీ ప్ర‌భుత్వంపై నింద‌లు వేయ‌లేము, నిజాల‌న్నీ ప్ర‌జ‌ల‌కు తెలిసిపోతాయ‌నే దుర్బుద్ధితోనే సీఎం చంద్ర‌బాబు రాష్ట్ర బ‌డ్జెట్‌లో అప్పుల గురించి ప్ర‌స్తావించ‌లేద‌న్నారు. 2019లో చంద్ర‌బాబు వైసీపీ ప్ర‌భుత్వానికి వ‌దిలేసిన అప్పులు రూ.3.13 ల‌క్ష‌ల కోట్లు అయితే త‌మ‌ ప్ర‌భుత్వం పూర్త‌య్యే నాటికి రాష్ట్ర అప్పు రూ.6,46,531 కోట్లు అయ్యిందని వైఎస్ జ‌గ‌న్ చెప్పారు. వాస్త‌వాలు ఇలా ఉంటే అప్పులు రూ.10 ల‌క్ష‌ల కోట్లు, రూ.12 ల‌క్ష‌ల కోట్లు అంటూ అబ‌ద్ధాలు ఆడుతూ సూప‌ర్ సిక్స్ ప‌థ‌కాల‌కు ఎగ‌నామం పెడుతున్నార‌న్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment