ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ మరియు పతంజలి ఆయుర్వేద ఎండీ ఆచార్య బాలకృష్ణపై కేరళ కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల గురించి ప్రచారం చేసిన ప్రకటనలు తప్పుదోవ పట్టించేలా ఉన్నాయన్న ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో కేరళ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఫిర్యాదు చేయడంతో, పాలక్కాడ్ కోర్టు వీరికి నోటీసులు పంపించింది.
ఫిబ్రవరి 1న విచారణకు హాజరుకావాలని కోర్టు ఆదేశించినప్పటికీ, వారు హాజరుకాలేదు. దీంతో కోర్టు వారిపై శనివారం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఇక ఈ కేసు ఫిబ్రవరి 15న తిరిగి విచారణకు రానుంది. ఇంతకుముందు, పతంజలి అనుబంధ సంస్థ దివ్య ఫార్మసీకి చెందిన పది ఉత్పత్తులపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ ఉత్పత్తుల ప్రచారంలో అవాస్తవాలు ఉన్నాయని, ప్రజలను తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయని ఆరోపణలొచ్చాయి. అందువల్ల, వాటి తయారీ లైసెన్స్ కూడా రద్దు చేశారు.