రిజ‌క్టెడ్‌ కంపెనీతో మ‌ళ్లీ ఒప్పందమా..? – యాక్సిస్‌తో ఒప్పందంపై సీపీఎం ఫైర్‌

రిజ‌క్టెడ్‌ కంపెనీతో మ‌ళ్లీ ఒప్పందమా..? - యాక్సిస్‌తో ఒప్పందంపై సీపీఎం ఫైర్‌

యాక్సిస్‌ (Axis) తో కూట‌మి ప్ర‌భుత్వం (Coalition Government) చేసుకున్న ఒప్పందంపై విమ‌ర్శ‌లు వ్య‌క్తం అవుతున్నాయి. త‌క్ష‌ణ‌మే ఆ ఒప్పందాన్ని ర‌ద్దు చేసుకోవాల‌న్న డిమాండ్లు తీవ్ర‌మ‌య్యాయి. రాష్ట్ర రైతాంగం అవ‌స‌రార్థం విద్యుత్ యూనిట్ ధ‌ర రూ.4.60కు అందించేలా యాక్సిస్ సంస్థ‌తో కూట‌మి ప్ర‌భుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. అయితే దేశంలోని అనేక రాష్ట్రాలు రూ.2.50 పైస‌ల‌కు విద్యుత్ సంస్థ‌ల‌తో ఒప్పందాలు కుదుర్చుకుంటుండ‌గా, కూట‌మి ప్ర‌భుత్వం రూ.4.60 పైస‌ల‌కు ఎంవోయూ చేసుకోవ‌డం విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది. వైఎస్ జ‌గ‌న్ స‌ర్కార్ రూ.2.49 పైస‌ల‌కు సెకీతో చేసుకున్న ఒప్పందంపై ఆరోప‌ణ‌లు చేసిన చంద్ర‌బాబు.. యూనిట్ ధ‌ర రూ.4.60కి ఎంవోయూ (MOU) చేసుకోవడం అనేక ప్ర‌శ్న‌ల‌కు తావిస్తుండ‌గా, ఇదొక కుంభ‌కోణంగా ప్ర‌తిప‌క్ష పార్టీలు ఆరోప‌ణ‌లు చేస్తున్నాయి.

సీపీఎం ఆగ్ర‌హం
సీఎం చంద్ర‌బాబు నాయుడు
2018లో తిరస్కరించిన సంస్థ‌తో తిరిగి ఒప్పందం కుదుర్చుకోవ‌డం దారుణ‌మ‌ని, యాక్సిస్‌తో రాష్ట్ర ప్ర‌భుత్వం చేసుకున్న ఒప్పందాన్ని వెంట‌నే ర‌ద్దు చేయాల‌ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి (State Secretary of CPM) శ్రీనివాసరావు (Srinivasa Rao) డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రజలపై రూ.15 వేల కోట్లు భారం మోపి, యాక్సిస్‌ కంపెనీకి కట్టబెట్టడానికి టీడీపీ (TDP) కూటమి ప్రభుత్వం చేయించిన ఈ ఒప్పందం ఎంతమాత్రమూ అనుమతించమ‌న్నారు. రాష్ట్ర ప్రజలపై పాతికేళ్ళపాటు రూ.15 వేల కోట్లు భారం వేసే ఈ ఒప్పందాన్ని విద్యుత్‌ రెగ్యులేటరీ కమిషన్ (ఏపీఈఆర్సీ) (APERC) ఆమోదముద్ర వేయడం అన్యాయమ‌ని మండిప‌డ్డారు.

దేశంలోని అనేక రాష్ట్రాల్లో యూనిట్‌ (Unit) రూ.2, రూ.2.50 పైస‌ల‌కు ఒప్పందాలు జరుగుతున్నాయని, చంద్ర‌బాబు ప్ర‌భుత్వం రూ.4.60 ధ‌రకు ఎందుకు కుదుర్చుకున్న‌ట్లు అని ప్ర‌శ్నించారు. గతంలో వైసీపీ హ‌యాంలో అదానీ (Adani) సంస్థతో సెకీ ద్వారా సోలార్‌ విద్యుత్‌ (Solar Power) యూనిట్‌ రూ.2.49లు ఒప్పందం చేసుకోగా అది అధిక రేటు అని తెలుగుదేశంతో సహా అన్నిపక్షాలు విమర్శించాయని, నేడు దానికంటే రూ.2.10లు అధికంగా చేసే ఒప్పందాలు చేసుకోవడం దారుణమ‌ని సీపీఎం నేత శ్రీ‌నివాస‌రావు కూట‌మి ప్ర‌భుత్వంపై మండిప‌డ్డారు.

వైసీపీ ట్వీట్ వైర‌ల్‌..
యాక్సిస్ సంస్థ‌తో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం చేసుకున్న ఒప్పందంపై వైసీపీ ట్వీట్ చేసింది. సెకీతో యూనిట్ రూ.2.49 చొప్పున వైఎస్ జ‌గన్ విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకుంటే ఎల్లో మీడియాతో కలిసి చంద్రబాబు పెడబొబ్బలు పెట్టార‌ని గుర్తుచేసింది. ఇప్పుడు ఇదే చంద్రబాబు.. ఏపీ అప్పులపాలు అయిపోయింది అంటూ గగ్గోలు పెడుతూనే యాక్సిస్ కంపెనీతో యూనిట్ రూ.4.60చొప్పున కొనుగోలుకు ఒప్పందం చేసుకోవ‌డం కుంభ‌కోణ‌మ‌ని అభిప్రాయ‌ప‌డింది. ఎవరిది విజన్.. ఎవరిది మూర్ఖత్వం? ఇప్పుడు చెప్పండి అంటూ ప్ర‌శ్న లేవ‌నెత్తుతూ వైసీపీ ట్వీట్ చేసింది.

Join WhatsApp

Join Now

Leave a Comment