ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూముల రిజిస్ట్రేషన్ విలువలను సవరించడం ద్వారా ప్రభుత్వ ఆదాయం పెంచుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. రిజిస్ట్రేషన్ చార్జీలు పెరగనున్నాయన్న వార్తతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు రద్దీగా మారాయి. కూటమి ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచబోతున్నట్లుగా గట్టి సంకేతాలు ఇచ్చింది. దీంతో జనవరి 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ చార్జీలను అమలు చేయాలని అధికారులు భావించినప్పటికీ, విధివిధానాలపై కసరత్తుతో నిర్ణయానికి ఇంకా సమయం అవసరమని ప్రభుత్వం వాయిదా వేసింది.
పెంపు భయంతో కోలాహలం
చార్జీలు పెరుగుతాయని తెలిసిన ప్రజలు తమ ఆస్తుల రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకోవాలని పెద్దఎత్తున కార్యాలయాలకు వచ్చారు. గత రెండ్రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద రద్దీ కొనసాగుతోంది. సాధారణ దినాలతో పోలిస్తే రెండ్రోజులుగా రెట్టింపు రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. దాదాపు 20 శాతం రిజిస్ట్రేషన్ చార్జీలు పెరుగుతాయన్న వార్తతో ఆస్తుల క్రయవిక్రయాలు ఊపందుకున్నాయి.
భూములకు ఉన్న డిమాండ్ను, ప్రస్తుతం ఉన్న ధరలను పరిశీలించి కొత్త ధరలపై ఓ రిపోర్టు తయారు చేయాలని జిల్లాల కలెక్టర్లను కూటమి ప్రభుత్వం ఆదేశించింది. ఈ విధానంపై ప్రజా ప్రతినిధుల నుంచి కూడా వ్యతిరేకత వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ నిర్ణయంపై ప్రజల నుంచి, ప్రభుత్వ వర్గాల నుంచి వచ్చిన సూచనలతో మార్కెట్ ధరల పెంపు నిర్ణయంపై ప్రభుత్వం పునరాలోచనలో పడింది.
నూతన సంవత్సరం మొదటి రోజు నుంచి భూముల మార్కెట్ ధరల పెంపు అమలు చేసే నిర్ణయంతో ప్రజలు ఆందోళనకు దిగారు. అందుకే, ఈ అంశంపై సమగ్రంగా చర్చించి, జనవరి 1 నుండి భూముల ధరల పెంపు అమలును వాయిదా వేసినట్టు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటించారు. కొత్త రిజిస్ట్రేషన్ చార్జీలు ఎప్పుడు అమలులోకి వస్తాయన్నదానిపై సోమవారం స్పష్టత రావొచ్చని సమాచారం. చార్జీల పెంపుదల ఖాయమని భావిస్తున్నందున ప్రజలు ఇప్పుడే రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.