ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ అయ్యారు. ముంబైకి చెందిన నటి జెత్వానీ కేసులో ఆయనపై ఉన్న ఆరోపణల నేపథ్యంలో ఏపీ సీఐడీ అధికారులు హైదరాబాద్లో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను విజయవాడకు తరలించినట్లు సమాచారం.
పీఎస్ఆర్ ఆంజనేయులు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా కీలక బాధ్యతలు నిర్వహించారు. జెత్వానీ కేసులో ఆయన ప్రమేయం ఉండవచ్చన్న అనుమానాలతో సీఐడీ విచారణ చేపట్టినట్టు తెలుస్తోంది. ఈ అరెస్టు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. మాజీ ఇంటెలిజెన్స్ అధికారి అరెస్టు కావడం రాష్ట్ర రాజకీయ, పోలీసు వ్యవస్థలపై పలు ప్రశ్నలు తెరపైకి తెస్తోంది.
కాగా, తెలుగు ప్రజలకు అపరిచితురాలైన నటి జెత్వానీని తీసుకువచ్చి పారిశ్రామిక వేత్తలను, జగన్ ప్రభుత్వంలో కీలక శాఖలకు హెచ్ఓడీలుగా పనిచేసిన వారిని టార్గెట్ చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్రానికి రావాల్సిన రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులను కూటమి ప్రభుత్వం అడ్డుకుందని, ఏపీలో పెట్టుబడి పెట్టకుండా ప్రముఖ పారిశ్రామిక వేత్త జిందాల్ను బెదరగొట్టి పంపించేశారన్న ఆరోపణలూ ప్రస్తుత ప్రభుత్వంపై ఉన్నాయి. ఏపీ నుంచి వెళ్లిపోయిన జిందాల్ మహారాష్ట్ర ప్రభుత్వంతో రూ.2 లక్షల కోట్ల పెట్టుబడికి ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. జెత్వానీని అడ్డుపెట్టుకొని పలువురు సిన్సియర్ ఐపీఎస్ అధికారులను కూటమి ప్రభుత్వం విధులకు దూరం చేసిందనే విమర్శలు సైతం ఉన్నాయి. కాగా, ఈ కేసు వెనుక ఉన్న నిజానిజాలు త్వరలోనే వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.