గురుకుల విద్యాలయాల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు కనీస వసతులు లేక అల్లాడిపోతున్నారని విమర్శలు తీవ్రమైన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ఓ ప్రకటన చేసింది. ఈ మేరకు మంత్రి బాల వీరాంజనేయ స్వామి ఆ వివరాలను వెల్లడించారు. భీమ్ ప్రాజెక్ట్ ద్వారా విద్యార్థులకు అత్యుత్తమ వైద్యం అందించేందుకు చర్యలు చేపట్టారు. ప్రతి జిల్లాలో ఒక డాక్టర్ను ఆరోగ్య పర్యవేక్షణ కోసం నియమించామని తెలిపారు.
హాస్టళ్లకు కొత్త పరికరాలు, మెరుగైన సౌకర్యాలు
సింగరాయకొండలో SC, BC వసతి గృహాలను తనిఖీ చేసిన మంత్రి, విద్యార్థుల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. గురుకులాల కోసం 15 రకాల పరికరాలతో కూడిన హెల్త్ కిట్లు అందించనున్నట్లు వెల్లడించారు. అదనంగా రూ.206 కోట్ల వ్యయంతో 62 కొత్త హాస్టళ్ల నిర్మాణం జరుపుతున్నామని తెలిపారు. ఈ చర్యలు విద్యార్థుల ఆరోగ్యం మరియు వసతి గృహాల సౌకర్యాలను మరింత మెరుగుపరుస్తాయని తెలిపారు.








