రాజ్యసభ (Rajya Sabha) సీటు విషయంలో బీజేపీ అధిష్టానం నిర్ణయం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి చంద్రబాబుకు (Chandrababu Naidu) షాక్ (Shock) ఇచ్చినట్లు అయ్యింది. ఏపీ రాజ్యసభ స్థానానికి కొత్త అభ్యర్థి పేరును తెరపైకి తెచ్చి అనూహ్య ప్రకటన చేసింది. సీఎం చంద్రబాబు ప్రతిపాదించిన అభ్యర్థిని కాకుండా, తన పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న గౌడ సామాజికవర్గానికి చెందిన వ్యక్తికి అవకాశం కల్పించింది.
అభ్యర్థిగా పాక..
ఏపీ నుంచి ఖాళీ అయిన రాజ్యసభ సభ్యత్వానికి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. భీమవరం (Bhimavaram) ప్రాంతానికి చెందిన బీజేపీ (BJP) నేత పాక వెంకట సత్యనారాయణ (Paka Venkata Satyanarayana) ను అభ్యర్థిగా ఆ పార్టీ కేంద్ర నాయకత్వం ప్రకటించింది. ప్రస్తుతం ఈయన ఏపీ బీజేపీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఉన్నారు. పాక వెంకట సత్యనారాయణ రేపు మధ్యాహ్నం నామినేషన్ (Nomination) వేయనున్నట్లుగా తెలుస్తోంది. వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి బీజేపీ అభ్యర్థిని ప్రకటించింది. గౌడ సామాజికవర్గానికి చెందిన వెంకట సత్యనారాయణ 1980లో కౌన్సిలర్గా పనిచేశారు. కాగా, బీజేపీ అధిష్టానం వెంకట సత్యనారాయణను అభ్యర్థిగా ప్రకటించడంతో బీజేపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో చేరుకొని ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.
మొదట అన్నామలై.. తరువాత మందకృష్ణ మాదిగ..
కాగా, ఏపీ నుంచి ఖాళీ అయిన రాజ్యసభ స్థానం నుంచి తమిళనాడుకు చెందిన బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలైకి అవకాశం కల్పిస్తారని మొదట్లో ప్రచారం జరిగింది. ఆ తరువాత మందకృష్ణ మాదిగ పేరును సీఎం చంద్రబాబు ప్రధాని మోడీ వద్ద ప్రతిపాదించినట్లుగా పలు మీడియా ఛానళ్లు ప్రచారం చేశాయి. మందకృష్ణ మాదిగను రాజ్యసభకు పంపించాలని సీఎం చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా మీడియాలో కథనాలు వెలువడ్డాయి. కాగా, బీజేపీ అధిష్టానం మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించింది. సీఎం చంద్రబాబు ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకోకుండా ఎక్కడా ఊసే లేని కొత్త అభ్యర్థిని ప్రకటించడం గమనార్హం. బీజేపీ తన నిర్ణయంతో చంద్రబాబుకు షాకిచ్చిందన్న ప్రచారం జరుగుతోంది. ఇటీవల టీడీపీపై, ఏపీ ప్రభుత్వ విధానాలపై ప్రశంసలు కురిపిస్తూ, వైఎస్ జగన్పై మంద కృష్ణమాదిగ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.