పరీక్షను వాయిదా వేయాలని గ్రూప్-2 అభ్యర్థులు వారి ఆందోళనను ఉధృతం చేశారు. రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాల్లో అభ్యర్థులు రోడ్లపై బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. రోస్టర్ విధానం క్లియర్ చేసి గ్రూపు2 మైయిన్స్ పరీక్ష నిర్వహించాలని విశాఖపట్నం, విజయవాడ ప్రాంతాల్లో ఆందోళనను తీవ్రతరం చేశారు. విశాఖ వెంకొజీపాలెం సిగ్నల్ పాయింట్ వద్ద సీఎం డౌన్ డౌన్, లోకేష్ డౌన్ డౌన్, DCM డౌన్ డౌన్ అంటూ అభ్యర్థులు నినాదాలు చేస్తున్నారు.
విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు యువగళం అంటే ఏమిటో చూపిస్తామని హెచ్చరిస్తున్నారు. కూటమి ప్రభుత్వాన్ని గెలిపిస్తే మీరు చేసేది ఇదా? నిరుద్యోగుల పట్ల డ్రామాలు ఆడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కూటమి సంగతి చెబుతాం అని హెచ్చరిస్తున్నారు.
గ్రూప్-2 మెయిన్ ఎగ్జామ్స్ నిర్వహణపై కొనసాగుతున్న ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. పరీక్ష రాసే అభ్యర్థులు కోరుతున్నా.. ఏపీపీఎస్సీ పరీక్ష వాయిదా వెయ్యలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం చంద్రబాబు ప్రభుత్వం లేఖల పేరుతో డ్రామా ఆడుతోందని అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేపు పరీక్ష నిర్వహించాలని అన్ని జిల్లాల అధికారులకు ఏపీపీఎస్సీ ఆదేశాలు జారీచేసింది. లేఖలు, ఆడియో లీక్స్ పేరుతో టీడీపీ నేతలు డ్రామా ఆడుతున్నారని అభ్యర్థులు ఆరోపణలు చేస్తున్నారు.
డ్యూటీ టైమింగ్స్ అయిపోవడంతో ఏపీపీఎస్సీ కార్యాలయం సిబ్బంది వెళ్లిపోయారు. కార్యాలయానికి తాళం వేసి ఉందని సెక్యూరిటీ సిబ్బంది చెప్తున్నారు. విజయవాడలో గ్రూప్-2 అభ్యర్థుల ఆందోళన కారణంగా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో అభ్యర్థులు ఆందోళన విరమించకపోవడంతో వివిధ మార్గాల ద్వారా ట్రాఫిక్ మళ్లిస్తున్నారు. 5 కిమీ మేర నేషనల్ హైవే బ్లాక్ అయ్యింది. రోస్టర్ లో సవరణలు చేశాకే పరీక్షకు హాజరావుతామని, లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.