నూతన సంవత్సర వేడుకలు విషాదంగా మారాయి. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అంతర్వేది బీచ్ వద్ద న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం కాకినాడ నుంచి వచ్చిన ముగ్గురు యువకులు ప్రమాదానికి గురయ్యారు. సముద్ర తీరానికి సమీపంలో ఉన్న ఒక రెస్టారెంట్లో రూమ్ తీసుకుని వేడుకలు చేసుకున్న వారు, అర్ధరాత్రి సమయంలో జీప్లో సముద్రపు ఒడ్డుకు వెళ్లారు.
అన్నా–చెల్లెళ్ళు గట్టు వద్ద మలుపు గుర్తించలేక జీప్ అదుపు తప్పి గోదావరిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నిమ్మకాయల శ్రీధర్, సాయినాథ్ గోపికృష్ణ జీప్లో ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే గోపికృష్ణ జీప్ నుంచి బయటకు దూకి ప్రాణాలు కాపాడుకోగలిగాడు. అయితే శ్రీధర్ మాత్రం జీపుతో సహా గోదావరి నదిలోకి వెళ్లిపోయాడు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, స్థానికులు ఘటనాస్థలికి చేరుకుని గాలింపు చర్యలు ప్రారంభించారు. నూతన సంవత్సరం వేళ జరిగిన ఈ దుర్ఘటనతో అంతర్వేది ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. శ్రీధర్ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తుండగా, ఈ ఘటనపై పూర్తి వివరాలు సేకరిస్తున్నామని పోలీసులు తెలిపారు.








